అర్ధరాత్రి వరకు వాటర్​ ట్యాంకర్లు సప్లయ్ .. డిమాండ్​ పెరగడంతో వాటర్​బోర్డు నిర్ణయం

అర్ధరాత్రి వరకు వాటర్​ ట్యాంకర్లు సప్లయ్ .. డిమాండ్​ పెరగడంతో వాటర్​బోర్డు నిర్ణయం
  • కొన్ని ప్రాంతాలకు బుక్​ చేసిన 4 రోజులకు వస్తున్న ట్యాంకర్లు 
  • పెండింగ్​ను వీలైనంత తగ్గించేందుకు అధికారులు ప్రయత్నం

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​పరిధిలో ఎండలు ముదరడంతో రోజురోజుకు తాగునీటికి డిమాండ్ పెరుగుతోంది. నల్లా నీళ్లు సరిపోని కాలనీల వాసులు ట్యాంకర్లు బుక్​చేసుకుంటున్నారు. బుకింగ్స్ కు సరిపడా అధికారులు సరఫరా చేయలేకపోతున్నారు. రోజుల తరబడి ఆర్డర్లు పెండింగ్ ఉంటున్నాయి. మొన్నటి దాకా బుక్​చేసిన రెండు రోజుల్లో ట్యాంకర్లను అందించగా, ప్రస్తుతం ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ట్యాంకర్ల సరఫరా టైమింగ్స్ పెంచాలని ప్లాన్​చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల ట్యాంకర్లు డెలివరీ చేస్తుండగా, వేసవి మొత్తం రాత్రి 11 గంటల వరకు సరఫరా చేయాలని నిర్ణయించారు. దీంతో పెండింగ్ కొంతైనా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే ట్యాంకర్ల సిబ్బంది వేసవి ముగిసే వరకూ రెండు షిప్టులు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.

లక్ష దాటిన బుకింగ్స్​

సిటీలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తుండగా, శివారు, ఓఆర్ఆర్ సమీపంలోని ప్రాంతాల్లో మాత్రం నాలుగు రోజులకోసారి, కొన్నిచోట్ల వారం రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. నల్లా నీళ్లు సరిపోనివారు ట్యాంకర్లు బుక్​చేసుకుంటున్నారు. వాటర్​బోర్డు అధికారులు 5 వేల లీటర్ల ట్యాంకర్​అయితే రూ.500, 10 వేల లీటర్లకు రూ.850 వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, నానక్​రామ్​గూడ, హైటెక్​సిటీ, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, అమీర్​పేట, శ్రీనగర్ కాలనీ, సికింద్రాబాద్ ప్రాంతాల నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో నాలుగురోజులకోసారి నీటి సరఫరా జరుగుతుండడంతో ఎక్కువ మంది ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఇక ఓఆర్ఆర్​పరిధిలోని గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటోంది. షార్టేజ్​ఉన్న ప్రాంతాల వారు ట్యాంకర్​బుక్​చేసుకున్న వారానికి కూడా రావడం లేదని వాపోతున్నారు. గతేడాది మొత్తం 97,536 ట్యాంకర్లను నగరవాసులు బుక్​చేసుకోగా, ఈసారి ఇప్పటివరకూ 1.13 లక్షల ట్యాంకర్లు బుక్​చేసుకున్నట్లు అధికారులు  చెబుతున్నారు. ప్రస్తుతం బోర్డు పరిధిలో 650 ట్యాంకర్లు ఆర్డర్ల కోసం నడుస్తుండగా, 200 ట్యాంకర్ల ద్వారా మురికివాడలు, నీటి సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉచితంగా సరఫరా చేసేందుకు వినియోగిస్తున్నారు.

హెడ్డాఫీస్​ నుంచి పర్యవేక్షణ

జలాశయాల్లో తగినన్ని నీటి నిల్వలు లేకపోవడంతో పొదుపుగా వాడుకోవాలని వాటర్​బోర్డు అధికారులు సూచిస్తున్నారు. డిమాండ్​కు అనుగుణంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఫ్రీ ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా హెడ్డాఫీస్​నుంచి పర్యవేక్షిస్తున్నారు. గ్రేటర్​పరిధిలోని 72 ఫిల్లింగ్​స్టేషన్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాటిని హెడ్డాఫీస్ కు అనుసంధానం చేసి మానిటర్​చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో విజిలెన్స్​టీమ్స్ పని చేస్తున్నాయని పేర్కొన్నారు.