- విద్య కోసం 30 వేల కోట్లు ఖర్చు చేస్తం
- లోన్లను ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి మినహాయించండి
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి
- నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
- యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్పై నిర్మల ప్రశంస..
- స్పెషల్ కార్పొరేషన్ వివరాలు ఇవ్వాలని సూచన
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ సీఎం రేవంత్ భేటీ
- హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
- 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని వెల్లడి
- తొమ్మిది కేంద్రీయ, 16 నవోదయ విద్యాలయాలు కేటాయించాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో విద్యాభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఇతర ఎడ్యుకేషన్ ప్రాజెక్టులకు తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఐఐఎం, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలను కేటాయించాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై వినతి పత్రాలు అందజేశారు.
యంగ్ ఇండియా స్కూళ్లతో లక్షలాది మందికి విద్య..
విద్యారంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నాం. వీటిల్లో 5 నుంచి 12వ తరగతి వరకు.. ఒక్కో స్కూల్లో 2,560 మంది చొప్పున మొత్తం 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఈ స్కూళ్లు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఎడ్యుకేషనల్ హబ్లుగా ఉండడంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. అత్యాధునిక వసతులు, లేబొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్లు ఖర్చవుతుంది. అలాగే రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, టెక్నికల్ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. మొత్తంగా రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి రూ.30 వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ నిధుల సమీకరణకు మేం స్పెషల్ పర్పస్ కార్పొరేషన్ (ఎస్పీసీ) ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వండి. విద్యారంగంపై చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించండి” అని సీఎం విజ్ఞప్తి చేశారు.కాగా, విద్యారంగ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నందుకు సీఎం రేవంత్ రెడ్డిని నిర్మల అభినందించారు. యంగ్ ఇండియా స్కూళ్ల మోడల్ బాగుందని ప్రశంసించారు. ప్రత్యేక కార్పొరేషన్కు సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు.
ఐఐఎం ఏర్పాటుకు హైదరాబాద్ అనుకూలం..
హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ‘‘దేశంలో మొత్తం 21 ఐఐఎంలు ఉన్నాయి. తెలంగాణలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలి. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించాం. తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంది. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు వసతులు కల్పనకు మేం సిద్ధంగా ఉన్నాం. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్కు ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీతో అనుకూల వాతావరణం ఉంది. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది” అని కేంద్రమంత్రికి విన్నవించారు.
కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి..
తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘‘గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి. హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి. వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు. కేంద్రమంత్రులతో సమావేశంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
మీ విజన్.. సూపర్
సీఎం రేవంత్కు సోనియా అభినందనలు
ప్రభుత్వ పనితీరు కూడా బాగుందని ప్రశంసలు
‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ డాక్యుమెంట్ అందించిన సీఎం
దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సోనియా సూచన
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విజన్ బాగుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశంసించారు. ఢిల్లీలో పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను ఆమెకు అందజేశారు. ఈ నెల 8,9 తేదీల్లో రాష్ట్రంలో రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమిట్- వివరాలతో పాటు రెండేండ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. అనంతరం సోనియా మాట్లాడుతూ.. విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ దిశలో గ్లోబల్ సమిట్ను విజయవంతం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
