
హైదరాబాద్, వెలుగు: ఫ్యామిలీ డిజిటల్కార్డులకు సంబంధించి కుటుంబ సభ్యుల గ్రూప్ఫొటో ఆప్షనల్మాత్రమేనని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు అనుమతిస్తేనే ఫొటో తీయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పైలెట్ ప్రాజెక్టు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. సోమవారం సెక్రటేరియెట్లో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై అధికారులతో రేవంత్రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిట్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు, వివరాల సేకరణకు చేపడుతున్న ఏర్పాట్లను సీఎంకు అధికారులు వివరించారు.
ప్రభుత్వం దగ్గర ఉన్న రేషన్ కార్డు, పింఛను-, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ, కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందన్నారు. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామాలు, వార్డులు, డివిజన్ల ఎంపిక పూర్తయిందని వివరించారు. పైలెట్ ప్రాజెక్టును ఎన్ని రోజులపాటు చేపడతారని సీఎం అడగ్గా.. ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు 5 రోజులపాటు చేపడతామని అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని, అప్పుడే పకడ్బందీగా కార్యక్రమం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. పైలెట్ ప్రాజెక్టులో దానిని నిర్ధారించుకోవడంతోపాటు కొత్త సభ్యులను జత చేయడం, మృతి చెందిన వారిని తొలగించడం చేస్తామని అధికారులు వివరించారు.
ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పులు, చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని , ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. పైలెట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సానుకూలతలు, ఎదురైన ఇబ్బందులతో నివేదిక రూపొందించి, సమర్పించాలని సూచించారు. ఆ నివేదికపై చర్చించి, లోపాలను సవరించిన తర్వాతే క్షేత్రస్థాయి పరిశీలన చేపడదామని తెలిపారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారు.
ఒకవేళ పూర్తిగా పట్టణ, నగర నియోజకవర్గమైతే రెండు వార్డులు, డివిజన్లు.. పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైతే రెండు గ్రామాల్లో మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని సీఎం సూచించారు. వార్డులు, డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పాపులేషన్ ఆధారంగా పరిశీలన బృందాల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ఈ రివ్యూలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీలు చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అస్వస్థతకు గురవడంతో మంగళవారం ఉదయం ఆయనను పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో సీఎం పార్టీ అగ్రనేతలను కూడా కలవనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ పరిస్థితులపై హైకమాండ్ తో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తున్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వారి బంధువులపై ఈడీ దాడులు, నామినేటేడ్ పోస్టుల భర్తీ, ఇప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలను వివరించనున్నారు. వరద నష్టం సాయంపై కూడా కేంద్ర మంత్రులను సీఎం కలిసే అవకాశం ఉన్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది.