ప్రజల మనిషి దత్తన్న.. రాజకీయాల్లో వాజ్​పేయికి ఉన్న గౌరవం.. రాష్ట్రంలో ఆయన సొంతం: సీఎం రేవంత్​

ప్రజల మనిషి దత్తన్న.. రాజకీయాల్లో వాజ్​పేయికి ఉన్న గౌరవం.. రాష్ట్రంలో ఆయన సొంతం: సీఎం రేవంత్​
  • నా స్కూల్ బీజేపీ.. కాలేజీ టీడీపీ.. రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం 
  • అందరి సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి.. కిషన్ రెడ్డి కలిసి రావాలి
  • పీజేఆర్, దత్తాత్రేయ లాంటి వాళ్ల స్ఫూర్తి తమ నిర్ణయాల్లో  ఉంటదని వెల్లడి 
  • బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ
  • మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరు

హైదరాబాద్, వెలుగు: బండారు దత్తాత్రేయకు అజాత శత్రువు అనే పదం నూటికి నూరుపాళ్లు సరిగ్గా సరిపోతుందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. దేశస్థాయిలో ఏబీ వాజ్ పేయికి ఉన్నంత గౌరవం రాష్ట్రంలో బండారు దత్తాత్రేయకు ఉన్నదని చెప్పారు. పదవిలో ఉన్నా లేకున్నా మన రాష్ట్రంలో దత్తాత్రేయను రాజకీయాలకతీతంగా గౌరవిస్తారని తెలిపారు. ఆయన నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి రాజకీయాలకతీతంగా అందరూ హాజరవుతారని గుర్తుచేశారు. ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ‘ప్రజల కథే.. నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు దత్తాత్రేయది సుదీర్ఘ  ప్రయాణమని చెప్పారు. ఆయన జీవితంలో ఎన్నో పదవులు అధిష్టించినా ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదని పేర్కొన్నారు. దత్తాత్రేయతో వ్యక్తిగతంగా తనకు సన్నిహిత సంబంధం ఉందని, ఆయన్ను చాలా దగ్గరగా చూశానని వెల్లడించారు. ఇంతమంది గవర్నర్లను ఒకేచోట చూడటం ఇదే తొలిసారి అని, గవర్నర్ల పరేడ్​లాగా ఉందని చెప్పారు. మరోపక్క మంత్రివర్గమంతా ఇక్కడే ఉందని, కేబినెట్​ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చని చమత్కరించారు.  దత్తాత్రేయ, కిషన్‌‌‌‌రెడ్డి కుటుంబాలతో తనకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు.  కొత్తగా రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్లు దత్తాత్రేయ నుంచి  నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. 

జంట నగరాల్లో పేదలకు కష్టమొస్తే గుర్తొచ్చేది ఆ ఇద్దరే
 జంటనగరాల్లో పేదలకు కష్టం వచ్చినపుడు గుర్తొచ్చేది ఇద్దరే నాయకులని, దాంట్లో ఒకరు పి.జనార్ధన్​రెడ్డి, మరొకరు దత్తాత్రేయ అని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ప్రజల గుండెల్లో వారిద్దరూ చిరస్థాయిగా ఉంటారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో పీజేఆర్, దత్తాత్రేయ స్ఫూర్తి కచ్చితంగా ఉంటుందని తెలిపారు.  ఇటీవల జరిగిన నీతి అయోగ్ మీటింగ్ లో  చంద్రబాబు నాయుడు ను చూపించి ‘‘ఆప్ కీ సాథియా వా హై’’ అని తనతో మోదీ అన్నారని రేవంత్​ గుర్తుచేశారు. దానికి నేను ‘‘నా స్కూల్‌‌‌‌ చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో.. ఉద్యోగం రాహుల్‌‌‌‌ గాంధీ వద్ద చేస్తున్నా’’ అని  ప్రధానికి చెప్పానని అన్నారు. తనకున్న సన్నిహిత సంబంధాలను ఎప్పుడు దాచుకోనని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నా.. ఆ కార్యక్రమం అవ్వగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చానని అన్నారు.  కిషన్ రెడ్డి తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని, ఆయన తమతో కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంవైపు వేగంగా ముందుకు పోతుందని చెప్పారు. రాజకీయాలకతీతంగా గౌరవిస్తూనే, అప్పుడప్పుడు కిషన్ రెడ్డినీ ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు.

దత్తాత్రేయ డిక్షనరీలో శత్రువులే లేరు: రామ్ నాథ్ కోవింద్ 
శత్రువు, ప్రత్యర్థి అనేవాళ్లు దత్తాత్రేయ డిక్షనరీలోనే లేరని మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అన్నారు. ప్రతి ఒక్కరికీ అయన స్నేహితుడేనని చెప్పారు.  రాజకీయాల్లో బూతులు మాట్లాడే వారికి పోలింగ్​ బూత్​లోనే సమాధానం చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.  అందరినీ మెప్పించేలా ఆత్మకథ రాయడం చాలా కష్టమని తెలిపారు.  దత్తాత్రేయ ఇప్పటికీ గంజి మనిషిగానే ఉన్నారు..  కానీ బెంజ్ మనిషిగా మారలేదని, ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.  తనలాంటి ఎంతో మంది కార్యకర్తలను తయారు చేసిన ఘనత బండారు దత్తాత్రేయదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన పోటీ చేసి గెలిచిన సికింద్రాబాద్ నుంచి తాను ఎన్నికవడం గర్వంగా ఉందని చెప్పారు. 

దత్తాత్రేయ రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. రెండు పర్యాయాలు సికింద్రాబాద్ నుంచి, ఒక్కసారి గోషామహల్ నుంచి ఓటమి పాలయ్యారని, అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదని తెలిపారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దత్తాత్రేయ.. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అత్యున్నతమైన రాజ్యాంగ పదవి గవర్నర్ వరకు ఎదిగారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన కార్యదర్శి జస్టిస్​ ఎన్వీ రమణ అన్నారు.  దత్తాత్రేయ కష్టపడి పైకి వచ్చిన నేత అని తెలంగాణ గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ తెలిపారు. కాగా, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ,  ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ మంత్రి సత్యకుమార్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఒడిశా గవర్నర్ హరిబాబు, ప్రభుత్వ సలహాదారు  కే కేశవరావు, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి, బీజేపీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల రాజకీయ నాయకులు, సన్నిహితులు పాల్గొన్నారు.  

ఆర్ఎస్ఎస్​ నా ప్రాణం.. నా సర్వం: దత్తాత్రేయ 
ఆర్ఎస్ఎస్ తనకు ప్రాణం, తన ఆత్మ, సర్వం అని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అని అన్నారు. తనను చాలామంది పుస్తకం రాయాలని కోరారని గుర్తుచేశారు. ఈ క్రమంలో తాను కూడా ఆలోచించి.. తన జీవిత చరిత్ర రాశానని వివరించారు. కొవిడ్ టైమ్​లో 4 నెలల పాటు రికార్డు చేసి.. దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చినట్టు వెల్లడించారు. తనను రాజకీయాల్లోకి వీ రామారావు, బంగారు లక్ష్మణ్ తీసుకొచ్చారని తెలిపారు. ఇంద్రసేనా రెడ్డి కూడా తన వెన్నంటి నడిపించారని వివరించారు. రాజకీయాలు వృత్తి, వ్యాపారం కోసం కాదని.. సమాజం కోసమన్నారు. 

సమాజం కోసం పని చేయాలని, పేదల వృద్ధికి కష్టపడాలని కోరారు. తన ఎదుగుదలకు బీజేపీ కార్యకర్తలే కారణమన్నారు. వారి కృషితోనే కేంద్రమంత్రి, ప్రస్తుతం గవర్నర్​గా ఉన్నానని పేర్కొన్నారు. కార్యకర్తలే తన ఆస్తి అని, తన ఇంట్లో తక్కువగా తిన్నానని, కార్యకర్తల ఇంట్లోనే ఎక్కువగా తిన్నారని గుర్తు చేశారు. తన భార్య వసంత అన్ని విషయాల్లో అర్థం చేసుకున్నదని చెప్పారు. తన కొడుకు వైష్ణవ్ చనిపో యారని, తన కొడుకులాగే తన బిడ్డ విజయలక్ష్మి అండగా నిలిచిందని తెలిపారు. ఆమె ధైర్యంతోనే ముందుకొచ్చినట్టు వెల్లడించారు.

దత్తాత్రేయను స్ఫూర్తిగా తీసుకొని పాలన: చంద్రబాబు
బండారు దత్తాత్రేయ బీజేపీలో ఉన్నా అన్ని పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏటా ఆయన నిర్వహించే అలయ్​ బలయ్​లో అన్ని పార్టీల నుంచి నేతలు పాల్గొంటారని చెప్పారు. దత్తాత్రేయను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయాలని అన్నారు.   రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు జాతి ఒక్కటేనని తెలిపారు. తాను ఎక్కడున్నా అందరివాడినని చెప్పారు.