ఆఖరి రోజు.. రేవంత్​ ప్రచార హోరు..

ఆఖరి రోజు.. రేవంత్​ ప్రచార హోరు..
  •     నియోజక వర్గంలో రోడ్​ షోలు, జిల్లా కేంద్రంలో ర్యాలీ
  •     భారీగా తరలివచ్చిన జనం

కామారెడ్డి/ కామారెడ్డిటౌన్​, వెలుగు : ఎన్నికల ప్రచారానికి మంగళవారం ఆఖరి రోజు కావడంతో కామారెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థి, పీసీసీ ప్రెసిడెంట్​ హోరెత్తించారు. నియోజకవర్గాల్లో రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​లు, జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఆయా సందర్భాల్లో రేవంత్​ రెడ్డి మాట్లాడారు. ‘రాష్ర్ట నలుమూలాల తిరిగే బాధ్యత పార్టీ తనపై పెట్టడంతో నియోజకవర్గానికి ఎక్కువ సార్లు రాలేకపోయానన్నారు. త్వరలోనే తప్పకుండా అన్ని గ్రామాలు తిరుగుతానని చెప్పారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వాలన్నారు. 40 ఏళ్ల కేసీఆర్​ రాజకీయాల్లో    అమ్మమ్మ ఊరు, అమ్మ ఊరు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు.

కేసీఆర్​కు ఇయ్యాల కోనాపూర్​ గుర్తుకు వచ్చిందా అని విమర్శించారు. కామారెడ్డి రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్​ కార్మికులు కష్టాల్లో ఉన్నప్నుడు ఇక్కడకు రాలేదన్నారు. కామారెడ్డి మార్కెట్​ను విస్తరించాలనే అలోచన చేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్​కు ఓటు వేయటం మరచిపోవద్దన్నారు. బీఆర్​ఎస్​కు ఓటు వేసి తమకు కష్టాలు వచ్చాయని చెప్పారు. స్టేట్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. రైతులు, కార్మికులు, బీడీ కార్మికులు, పేదల సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ పని చేస్తుందని అన్నారు.

కామారెడ్డిలో పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. హైదారబాద్​ , నిజామాబాద్​ హైవేలో పారిశ్రామిక కారిడర్​ గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత కాంగ్రెస్​ పార్టీ తీసుకుంటుందన్నారు.ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు యూసుఫ్​అలీ, అనిల్​, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్​రావు, లీడర్లు పండ్ల రాజు, శ్రీనివాస్​రెడ్డి, వేణుగోపాల్​రెడ్డి, శ్రీను, ఆశోక్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

జిల్లా కేంద్రంలో ర్యాలీ

కామారెడ్డిలో కాంగ్రెస్​ పార్టీ ర్యాలీ నిర్వహించింది. వీక్లి మార్కెట్​ నుంచి ప్రారంభమైన ర్యాలీ, జేపీఎన్​ చౌరస్తా , సుభాష్​రోడ్డు, స్టేషన్​ రోడ్డు, రైల్వే కమాన్​, నిజాంసాగర్​ ఛౌరస్తా వరకు సాగింది. ఇక్కడ ప్రజలను ఉద్ధేశించి రేవంత్​రెడ్డి మాట్లాడారు. బీబీపేట, దోమకొండల్లో కూడా ర్యాలీలు నిర్వహించారు.