దొరల రాజ్యాన్ని బొందపెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తేవాలి : రేవంత్ రెడ్డి

దొరల రాజ్యాన్ని బొందపెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తేవాలి : రేవంత్ రెడ్డి

పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి తనకు పెద్దన్న అని చెప్పారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మచ్చలేని నాయకుల్లో మొదటి వ్యక్తి రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. కొండా దంపతులు పరకాల నుండి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే (చల్లా ధర్మారెడ్డి) అణిచివేతను తట్టుకున్నారని, కడుపులో పెట్టుకుని కాపాడే రేవూరి మీ కోసం వచ్చాడు అని చెప్పారు. వరంగల్ జిల్లా పరకాల కాంగ్రెస్​ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
 
పరకాల అభివృద్ధి రేవూరి ప్రకాశ్ రెడ్డితోనే సాధ్యమన్నారు రేవంత్ రెడ్డి. సాయుధ రైతాంగ పోరాటానికి అనాడు ఫిరంగిలా పరకాల మారిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ప్రాంతం పరకాల అని గుర్తు చేశారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మస్థలం కూడా పరకాల అని చెప్పారు. ప్రత్యేక నిధులు ఇచ్చి పరకాలను పూర్తిగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కేసీఆర్ మాటలు చూస్తే మందేసి, మతి తప్పి మాట్లాడినట్లు ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటే హేళన చేస్తున్నారని మండిపడ్డారు. దొరల రాజ్యం కావాలా..? ఇందిరమ్మ రాజ్యం కావాలా తేల్చుకోండి అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు పదవులు అనుభవించేలా చేసింది అనాడు ఇందిరమ్మ రాజ్యం అన్నారు. దొరల రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవాలని పిలుపునిచ్చారు.