మణిపూర్​లో మళ్లీ అల్లర్లు...బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి

మణిపూర్​లో మళ్లీ అల్లర్లు...బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి

ఇంఫాల్: మణిపూర్​లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన గొడవలు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి. భద్రతా దళాలు, కుకి తెగకు చెందిన వేర్పాటువాదుల మధ్య జరిగిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ చనిపోయాడు. అస్సాం రైఫిల్స్​​కు చెందిన ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు కక్చింగ్ జిల్లా సుగ్నులోని సెరౌ ప్రాక్టికల్ హైస్కూల్​లో బీఎస్ఎఫ్ దళాలను మోహరించారు. వీరిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం తెల్లవారుజామున కుకి తెగకు చెందిన వేర్పాటువాదులు కాల్పులు జరిపారు. దీంతో బీఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రంజిత్ యాదవ్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.

ఈ నెల 10 దాకా ఇంటర్​నెట్ సేవలు నిలిపివేత

కాల్పులు జరిపిన వేర్పాటువాదుల కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. మణిపూర్​లోని సుగ్ను, సెరౌ ఏరియాల్లో కుకి తెగకు చెందిన వేర్పాటువాదులు ఎక్కువగా ఉంటారని వివరించారు. కాగా, ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని ఫాయెంగ్​లో భద్రతాదళాలు, కుకి తెగకు చెందిన వేర్పాటువాదుల మధ్య కాల్పులు జరిగాయని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. అల్లర్లు జరిగిన ఏరియాల్లో జూన్ 10, మధ్యాహ్నం 3 గంటల దాకా ఇంటర్​నెట్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అల్లర్లలో ఇప్పటి వరకు 98 మంది చనిపోగా, 310 మంది వరకు గాయపడ్డారు.