- పడిపోతున్న డిమాండ్, వినియోగం..
- తగ్గిన టూ వీలర్, ట్రాక్టర్, ఎరువులు, ఎఫ్ఎంసీజీ అమ్మకాలు
- ఉపాధి హామీ స్కీమ్కు పెరిగిన డిమాండ్..నిరుద్యోగం రేటు 8 ఏళ్ల గరిష్టానికి
బిజినెస్ డెస్క్, వెలుగు:ఆహార పదార్ధాల ధరలు (ఇన్ఫ్లేషన్) పెరగడం, నిరుద్యోగం ఎక్కువవ్వడం, కన్జూమర్ డిమాండ్ తగ్గిపోవడం.. ప్రస్తుతం రూరల్ ఎకానమీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సబ్బులు, షాంపూలు వంటి ఎఫ్ఎంసీజీ గూడ్స్ను అమ్మే కంపెనీల సేల్స్ కరోనా సెకెండ్ వేవ్ తర్వాత నుంచి పడిపోతున్నాయి. రూరల్ ఎకానమీ గురించి తెలిపే ట్రాక్టర్ సేల్స్, టూ వీలర్, ఎరువుల అమ్మకాలు 2020–21 తో పోలిస్తే 2021–22 లో బాగా తగ్గాయి. దీనికి తోడు గ్లోబల్గా, లోకల్గా ఇన్ఫ్లేషన్ (ధరలు) పెరుగుతుండడంతో రూరల్ ఏరియాల్లో కొనుగోళ్లు తగ్గిపోతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ వార్ స్టార్టయిన తర్వాత దేశంలో ఇన్ఫ్లేషన్ పెరగడాన్ని గమనించొచ్చు. మరోవైపు ప్రతీ ఫైనాన్షియల్ ఇయర్లో కచ్చితంగా 100 రోజుల పాటు పనిని కలిపించే ఎంజీఎన్ఆర్జీఏ (ఉపాధి హామీ పథకం) స్కీమ్కు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ డేటా ప్రకారం, మొత్తం 19 రాష్ట్రాలు 2021–22 కి సంబంధించిన ఎంజీఎన్ఆర్జీఏ నిధులను ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే పూర్తిగా వాడేశాయి. దీని బట్టి లేబర్ మార్కెట్లో ఇంకా పనులు దొరకడం లేదనే విషయం అర్థమవుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు.
వినియోగం తగ్గింది..
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత నుంచి రూరల్ ఎకానమీలో బలహీన సంకేతాలు కనిపించడం మొదలయ్యిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడంతో ప్రజలు చేసే ఖర్చులు తగ్గిపోయాయని, ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయని చెప్పారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత నుంచి ప్రజలు ఖర్చు చేయడంలో జాగ్రత్తపడుతున్నారని, రూరల్ ఎకానమీలో డిమాండ్ పడిపోవడానికి ఇదే కారణమని బ్రోకరేజి కంపెనీ ప్రభుదాస్ లిల్లాధర్ ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, 2021–22 లోని క్యూ1 లో రూరల్ ఎకానమీలో వినియోగం (ఖర్చు చేయడం) గ్రోత్ 12.60 శాతం నమోదవ్వగా, క్యూ3 నాటికి ఈ గ్రోత్ 2 శాతానికి తగ్గింది. వెహికల్స్ డిమాండ్ పడిపోవడం రూరల్ ఎకానమీలో బలహీనతను చూపుతోంది. సప్లయ్ చెయిన్లో సమస్యలు, ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో కంపెనీలు తమ ప్రొడక్ట్ల రేట్లను పెంచుతున్నాయి. దీంతో ప్రజలు ఖర్చులు చేయడం తగ్గిపోతోందని ఎనలిస్టులు పేర్కొన్నారు.
పంటల దిగుబడి పెరగనుంది..
దేశంలో ఇన్ఫ్లేషన్ 17 నెలల గరిష్టమైన 6.95 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ (ఆహార పదార్ధాల ధరలు) ఏడాది టైమ్లోనే డబుల్ అయ్యింది. కిందటేడాది మార్చిలో రూరల్ ప్రాంతాల్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ 3.94 శాతంగా నమోదు కాగా, ఈ ఏడాది మార్చిలో ఈ నెంబర్ 8.04 శాతానికి పెరిగింది. మరోవైపు గ్లోబల్ అంశాల వలన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడంతో రైతులకు కొంత సపోర్ట్ దొరుకుతోందని ఐసీఆర్ఐఈఆర్ సీనియర్ కన్సల్టెంట్ శ్వేత సైని అన్నారు. ఐఎండీ అంచనాల ప్రకారం, ఈ ఏడాది మాన్సూన్లో వివిధ పంటల దిగుబడి పెరగనుంది. అయినప్పటికీ ఇన్ఫ్లేషన్ దిగిరాకపోవచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభంతో గ్లోబల్గా సప్లయ్ చెయిన్లో సమస్యలు వచ్చాయని, దీంతో వంటనూనె, చికెన్, ఎగ్స్ వంటి పౌల్ట్రీ ఫుడ్, ఇతర ప్రొడక్ట్ల రేట్లు ఇప్పటిలో దిగిరాకపోవచ్చని చెబుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు పెరగడంతో దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ పెరిగే ఛాన్స్ ఉందని, దీంతో రూరల్ ఎకానమీలో సెంటిమెంట్ మెరుగుపడుతుందని అంచనావేస్తున్నారు.
ఉపాధి పనులకు ఎక్కువ డిమాండ్..
తాజాగా రూరల్ ఏరియాల్లో నిరుద్యోగం పెరగడాన్ని గమనించొచ్చు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎనిమిదేళ్ల గరిష్టమైన 8.35 శాతానికి చేరుకుంది. మార్చి నెలలో 7.29 శాతంగా నమోదయ్యింది. మరోవైపు ఉపాధి హామీ పథకానికి ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతోంది. 2020–21 తో పోలిస్తే ఈ స్కీమ్ కింద 2021–22 లో పనిని కల్పించడం 7.1 శాతం తగ్గింది. అయినప్పటికి కరోనా ముందు స్థాయిల కంటే 36 శాతం ఎక్కువ పనిని ఈ స్కీమ్ కింద ప్రభుత్వం కలిపించింది. మరోవైపు రూరల్ ఎకానమీలో వర్కర్ పొందే సగటు జీతం కూడా తగ్గిపోయిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, బైన్ అండ్ కంపెనీ డేటా ప్రకారం, దేశ జీడీపీ (2019–20 డేటా) లో రూరల్ ఎకానమీ వాటా సుమారు సగం ఉంటుంది. మొత్తం 35 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. రూరల్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టార్ అతిపెద్ద సెగ్మెంట్. మొత్తం జీడీపీలో ఈ సెక్టార్ వాటా 37 శాతంగా ఉంటుంది. దేశంలో ఉపాధి పొందుతున్న మొత్తం వర్క్ ఫోర్స్లో రూరల్ సెక్టార్ వాటా 70 శాతంగా
ఉంటుందని అంచనా.