- హార్టికల్చర్ను ఆగం చేస్తున్రు
- సర్కార్ పట్టించుకోకపోవడంతో తగ్గుతున్న ఉద్యాన పంటలసాగు
- ఇప్పటివరకు 5 లక్షల ఎకరాలు కూడా దాటలే
- పంటల సాగు తగ్గడంతో పెరుగుతున్న వెజిటబుల్ ధరలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు తగ్గుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గత ఏడేండ్లలో లక్షలాది ఎకరాల హార్టికల్చర్ క్రాప్స్ కల్టివేషన్ తగ్గిపోయింది. దీంతో కూరగాయలు, ఉల్లిగడ్డలు, సుగంధ ద్రవ్యాల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. మిర్చీ మినహా అన్ని పంటల సాగు తగ్గుతోంది. వ్యవసాయ పంటలు లాస్ట్ ఇయర్ 1.35 కోట్ల ఎకరాల్లో సాగు కాగా, ఉద్యాన పంటలు 10 లక్షల ఎకరాలు కూడా దాటలేదు. ఈయేడు ఇప్పటికే వ్యవసాయ పంటలు 1.11 కోట్ల ఎకరాల్లో వేయగా, హార్చికల్చర్ పంటలు నిరుడులో సగం కూడా సాగు కాకపోవడం గమనార్హం.
హార్టికల్చర్కు అనుకూల వాతావరణం
రాష్ట్రంలో వాతావరణం, నేల రకాలు, నీటి వ్యవస్థ ఉద్యాన పంటలకు అనువుగా ఉంటాయి. ఇక్కడ పండించే పండ్లు, కూరగాయల్లో నిల్వ గుణం, రుచి, నాణ్యత, పోషకాలు మెండుగా ఉంటాయి. దేశవిదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా ఉంటాయి. కానీ, సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో రైతులు ఈ రంగం వైపు ఆసక్తి కనబరుస్తలేరు. దీంతో ఏటా హార్టీకల్చర్ క్రాప్స్ పడిపోతున్నాయి. మిర్చీకి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉండడంతో రాష్ట్రంలోని మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో నిరుడు కంటే ఈసారి రెట్టింపు స్థాయిలో వేస్తున్నారు. పసుపు పంట సాగు కూడా తగ్గుతూ వస్తోంది. ఈ రెండు పంటలకు సర్కారు ప్రోత్సహం లేకున్నా రైతులే సొంతంగా ఎక్కువ పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారు.
వానాకాలం వెజ్ క్రాప్స్ 50వేల ఎకరాలు మించలే
ఏటా వానాకాలం సీజన్లో పెరగాల్సిన కూరగాయల సాగు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో కనీసం 2.50 లక్షల ఎకరాలైనా సాగవ్వాల్సి ఉండగా, లాస్టియర్ కేవలం 97 వేల ఎకరాల్లోనే కూరగాయలు సాగయ్యాయి. ఈయేడు ఇప్పటి వరకు 50 వేల ఎకరాలకు మించలేదు. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంట ఆగమైంది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం చేయకపోవడంతో కూరగాయల సాగును రైతులు తగ్గిస్తున్నారు. దీంతో దిగుబడి తగ్గి, ధరలు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నరు.
గ్రేటర్ శివార్లలో కూరగాయల సాగు తగ్గింది
గ్రేటర్ హైదరాబాద్ శివారు జిల్లాల్లో కూరగాయల సాగు తగ్గింది. అంతకుముందు రంగారెడ్డి, మహేశ్వరం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్తో పాటు శివారు జిల్లాలైన యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్నగర్లలో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉండేది. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 2019లో 72 వేల ఎకరాల్లో కూరగాయలు సాగైతే, 2020లో అది 45 వేల ఎకరాలకు పడిపోయింది. ఈయేడు 25 వేల ఎకరాలకు మించలేదని తెలుస్తోంది. నిరుడు వికారాబాద్లో 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగు తగ్గగా, ఈయేడు మరింత పడిపోయింది. సూర్యాపేటలోనూ అదే పరిస్థతి ఉంది.
ఎంఎస్పీ పంటలే ఎక్కువేస్తున్నరు
గిట్టుబాటు ధర ఉన్న పంటలనే రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. హార్టికల్చర్ క్రాప్స్కు ధర ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియకపోవడంతో ఆ పంటలు వేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కూడా భరోసా ఇవ్వడం లేదు. ఫలితంగా ఈ ఏడు మద్దతు ధర ఉన్న పంటలే రైతులు ఎక్కువగా వేస్తున్నరు.
సర్కారు ప్రోత్సాహం కరువు
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నప్పటికీ రైతులను ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సాహించడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ను పక్కన పెట్టేశారు. కేంద్రం ఇచ్చే రాయితీల వాటా కూడా చెల్లించడం లేదు. దీంతో హార్టికల్చర్ క్రాప్స్ వేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. కూరగాయల విత్తనాలకు సబ్సిడీ కూడా ఇస్తలేరు. గతంలో కూరగాయల నారు ఇచ్చేవారు.. ప్రస్తుతం అది కూడా ఇవ్వకపోవడంతో కూరగాయల పంటలు వేయడానికి రైతులు ఇష్టపడడం లేదు. ప్రధానంగా టమాటా, ఉల్లి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.