మలేసియాలో రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం.. చనిపోయినవారిలో 14 మంది విద్యార్థులే

మలేసియాలో రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం.. చనిపోయినవారిలో 14 మంది విద్యార్థులే

కౌలాలంపూర్: మలేసియాలో సోమవారం వేకువజామున ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర మలేసియాలో యూనివర్సిటీ విద్యార్థులను క్యాంపస్​కు తీసుకెళ్తున్న బస్సు ఓ మినీవ్యాన్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టడంతో బస్సు సిబ్బంది సహా 15మంది చనిపోయారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్ సరిహద్దు సమీపంలోని ఈస్ట్-వెస్ట్ హైవేపై గెరిక్ పట్టణం వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. 

మలేసియాలో గత పదేండ్లలో ఇదే ఘోర ప్రమాదమని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 14 మంది విద్యార్థులేనని చెప్పారు. ఉత్తర మలేసియాలోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషనల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీకి చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తుండగా.. అదుపు తప్పి ముందు వెళ్తున్న మినీ వ్యాన్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడడంతో13మంది స్పాట్​లోనే ప్రాణాలు కోల్పోయారు. 

సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే స్పాట్ కు చేరుకుని గాయపడిన 33 మందిని ఆస్పత్రికి తరలించాయి. చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. మృతులందరు 21 నుంచి 23 ఏండ్ల మధ్య ఉన్నట్టు వివరించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని 
ఉన్నత విద్యామంత్రిత్వ శాఖను ఆదేశించారు.