మూడు నెలల్లో ఆర్వోబీ పనులు పూర్తి : వివేక్​ వెంకటస్వామి

మూడు నెలల్లో ఆర్వోబీ పనులు పూర్తి : వివేక్​  వెంకటస్వామి
  •     చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  •     క్యాతనపల్లి ఆర్వోబీ పనుల పరిశీలన
  •     పనుల జాప్యంపై ఆఫీసర్లు, కాంట్రాక్టర్​పై ఆగ్రహం

కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: రామకృష్ణాపూర్–మంచిర్యాల ప్రధాన రహదారి క్యాతనపల్లి రైల్వే ఓవర్​బ్రిడ్జి పనులను మూడు నెలల్లో పూర్తి చేయించనున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ 
వెంకటస్వామి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన ఆర్​అండ్​బీ ఆఫీసర్లు, కాంట్రాక్టర్, కాంగ్రెస్​ లీడర్లతో కలిసి ఆర్వోబీ పనులను పరిశీలించారు. పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై అధికారులు, కాంట్రాక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

క్వాలిటీలో రాజీపడొద్దని, నాణ్యతగా నిర్మించాలని ఆదేశించారు. వర్క్ ప్రోగ్రెస్​ను ప్రతిరోజు తనకు పంపాలని, 15 రోజులకు ఒకసారి వచ్చి పనులను పరిశీలిస్తానని చెప్పారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సాయికుటీర్​లో మిషన్​ భగీరథ పైపులైనును పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఆర్​అండ్​బీ ఈఈ నర్సింహాచారి, మనోజ్, కృష్ణ, క్యాతనపల్లి మున్సిపల్​మేనేజర్​నాగరాజు, కాంగ్రెస్​ లీడర్లు రాఘునాథ్​రెడ్డి, ఓడ్నాల శ్రీనివాస్​, రాజయ్య, మహంకాళి శ్రీనివాస్, యాకుబ్​అలీ​​ తదితరులున్నారు. 
 

క్రైస్తవ కుటుంబాలకు గిప్ట్​ల పంపిణీ
 

క్రిస్మస్​ పండుగ నేపథ్యంలో క్రైస్తవ కుటుంబాలకు సర్కార్ ​ఇస్తున్న బట్టలు, గిప్ట్​లను చెన్నూరు పట్టణంలోని షాదీఖానా ఫంక్షన్​ హాల్​లో ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోసం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన కోటపల్లి మండలం పారిపెల్లి గ్రామంలో కాలభైరవ స్వామి ఆలయాన్ని  దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చెన్నూరు మండలం లక్ష్మీపూర్​లో గిరిజన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు.  

సోమన్​పల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. చెన్నూరులోని క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న రిపేర్లను పరిశీలించి పనులు తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల జడ్పీ చైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి, చెన్నూరు మున్సిపల్​ చైర్​పర్సన్ ​అర్చనా గిల్డా,  మందమర్రి, చెన్నూరు, జైపూర్​ఎంపీపీలు మంగ, మంత్రి బాపు, రమాదేవి, జడ్పీటీసీలు రవి, తిరుపతి, సునీత, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్​పర్సన్ ​మూల రాజిరెడ్డి, పలు విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు.