నదిలో తేలుతున్న రాయి లభ్యం కావడం అది రామసేతు నిర్మాణానికి ఉపయోగించిందేనని వార్తలు రావడంతో బిహార్లోని ఓ ప్రాంతానికి భక్తులు తరలివెళ్తున్నారు. వివరాలు.. బిహార్ రాజధాని పట్నాలోని గంగానది రాజ్ఘాట్ వద్ద నీటిలో తేలియాడుతున్న ఓ రాయి భక్తులకు కనిపించింది.
దాన్ని బయటకి తీసి చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. రాయిపై 'శ్రీ రాం' అని ఉండటం నీటిలో తేలియాడుతుండటంతో రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాయేనని భక్తులు నమ్మారు.
ఈ వార్త వైరల్గా మారడంతో చుట్టు పక్క ప్రాంతాల భక్తులు రాయిని చూసేందుకు తరలి వచ్చారు. నదీ తీరంలో ఉన్న ఓ ఆలయంలోని నీటి తొట్టెలో దానిని వేశారు. భక్తుల రాకతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది.
ఆ ప్రాంతాన్ని రామ్ఘాట్గా మార్చాలని దేవాలయ సంఘాలు కోరుతున్నాయి. అది రామసేతులో ఉపయోగించిన రాయేనని, దానిపై రిసర్చ్ జరపాలని నిపుణులు కోరుతున్నారు. అయితే ఈ వాదనను ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.