IND vs ENG 2nd Test: నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు..ఇంగ్లాండ్‌ను భయపెడుతున్న రోహిత్ రికార్డ్

IND vs ENG 2nd Test: నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు..ఇంగ్లాండ్‌ను భయపెడుతున్న రోహిత్  రికార్డ్

ఇంగ్లాండ్ తో రెండో టెస్టుకు ముందు రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓడిపోవడం.. విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టులకు దూరమవ్వడం..తొలి టెస్ట్ తర్వాత జడేజా, రాహుల్ గాయం కారణంగా రెండో టెస్టులో  ఆడకపోవడం భారత్ ను కష్టాల్లో పడేసింది. దీనికి తోడు గిల్, శ్రేయాస్ అయ్యర్ పేలవ ఫామ్ ఆందోళనకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో జట్టు బ్యాటింగ్ భారమంతా కెప్టెన్ రోహిత్ శర్మపై పడనుంది. హిట్ మ్యాన్ టెస్టుల్లో ఏమంత గొప్ప ఫామ్ లో లేకపోయినా ఒక రికార్డ్ మాత్రం ఇంగ్లాండ్ ను వణికిస్తోంది. 

వైజాగ్ వేదికగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో భారత్ రేపు (ఫిబ్రవరి 2) ఇంగ్లాండ్ తో రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇదిలా ఉండగా వైజాగ్ లో రోహిత్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. చివరగా ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లో ఏకంగా మూడు సెంచరీలు చేయడం విశేషం. ఈ ఒక్క విషయమే టీమిండియా ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తుంది. 2019 సౌతాఫ్రికాతో సిరీస్ లో రెండో టెస్టులో హిట్ మ్యాన్ రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు బాదేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ తో ఓపెనర్ గా ఎంట్రీ ఇచ్చి తొలి ఇన్నింగ్స్ లో 244 బంతుల్లో 176 పరుగులు.. రెండో ఇన్నింగ్స్ లో 149 బంతుల్లో 127 పరుగులు చేశాడు.

2019 లో వెస్టిండీస్ పై జరిగిన రెండో వన్డేలో 159 పరుగుల భారీ సెంచరీ నమోదు చేశాడు. చివరి నాలుగు ఇన్నింగ్స్ లో ఇక్కడ రోహిత్ యావరేజ్ 100కి పైగా ఉంది. దీంతో రేపు మ్యాచ్ లో రోహిత్ చెలరేగాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. జట్టులో అనుభవం లేకపోవడంతో ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఏ స్థానంలో బరిలోకి దిగుతాడో చూడాలి. ఇప్పటికే ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించగా .. భారత్ ఏ జట్టుతో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది.