- ఢిల్లీ మళ్లీ..వరుసగా ఐదో మ్యాచ్లో ఓడిన క్యాపిటల్స్
- 23 రన్స్ తేడాతో బెంగళూరు విజయం
- రాణించిన కోహ్లీ, విజయ్ కుమార్
బెంగళూరు : ఐపీఎల్–16లో ఢిల్లీ క్యాపిటల్స్ చెత్తాట కొనసాగుతోంది. మెగా లీగ్ మొదలై రెండు వారాలైనా విజయాలబాట పట్టడం లేదు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా వరుసగా ఐదు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. మరోవైపు విరాట్ కోహ్లీ (34 బాల్స్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 50), కొత్త కుర్రాడు విజయ్ కుమార్ (3/20) చెలరేగడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 23 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్ ఓడిన ఆర్సీబీ 20 ఓవర్లలో 174/6 స్కోరు చేసింది. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 151/9 స్కోరుకే పరిమితమైంది. మనీష్ పాండే (38 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 50) టాప్ స్కోరర్. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్పిన్నర్ల జోరు.. విరాట్ హాఫ్ సెంచరీ
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ మెరుగ్గా ఆడింది. అయితే మధ్యలో పుంజుకున్న డీసీ స్పిన్నర్లు కుల్దీప్ (2/23), అక్షర్ పటేల్ (1/25), లలిత్ యాదవ్ (1/29) బెంగళూరును కట్టడి చేశారు. విరాట్ ఫోర్తో ఖాతా తెరిస్తే, డుప్లెసిస్ (22) కూడా రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చాడు. నాలుగో ఓవర్లోనే స్పిన్నర్ అక్షర్ను దించడంతో డుప్లెసిస్ సిక్స్తో స్వాగతం పలికాడు. కానీ ఐదో ఓవర్లో మిచెల్ మార్ష్ (2/18) డుప్లెసిస్ను ఔట్ చేయడంతో ఫస్ట్ వికెట్కు 42 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ (18 బాల్స్లో 2 సిక్స్లతో 26) కూడా వేగంగా ఆడటంతో 10 ఓవర్లకు ఆర్సీబీ 89/1 స్కోరు చేసింది. అయితే 11వ ఓవర్లో లలిత్ వేసిన ఫుల్ టాస్ను భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కోహ్లీ యష్ ధూల్కు క్యాచ్ ఇచ్చాడు.
రెండో వికెట్కు 47 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ (14 బాల్స్లో 3 సిక్స్లతో 24) ఇదే ఓవర్లో రెండు భారీ సిక్స్లు బాదాడు. 13వ ఓవర్లో మార్ష్.. మహిపాల్ను ఔట్ చేయడంతో మూడో వికెట్కు 28 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అవడంతో స్కోరు 117/3 అయ్యింది. ఇక్కడి నుంచి డీసీ స్పిన్నర్లు బెంగళూరు జోరుకు బ్రేక్ వేశారు. మూడు బాల్స్ తేడాతో హర్షల్ పటేల్ (6), మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (0) ఔటవడంతో ఆర్సీబీ స్కోరు132/6గా మారింది. చివర్లో షాబాజ్ అహ్మద్ (20 నాటౌట్), అనూజ్ (15 నాటౌట్) వేగంగా ఆడి ఏడో వికెట్కు 42 రన్స్ జత చేయడంతో ఆర్సీబీ మంచి టార్గెటే నిర్దేశించింది.
క్యూ కట్టిన్రు..
ఛేజింగ్లో ఆర్సీబీ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంలో డీసీ బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఓ ఎండ్లో మనీష్ పాండే స్థిరంగా ఆడినా.. రెండో ఎండ్లో మిగతా వారు పెవిలియన్కు క్యూ కట్టిన్రు. ఇన్నింగ్స్ నాలుగో బాల్కే పృథ్వీ షా (0) ఔట్తో మొదలైన వికెట్ల పతనానికి ఎక్కడా బ్రేక్ పడలేదు. హైదరాబాదీ సిరాజ్ (2/23), డెబ్యూ పేసర్ విజయ్కుమార్ వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ స్కోరు బోర్డుకు కళ్లెం వేశారు.
మిచెల్ మార్ష్ (0), యష్ ధూల్ (1), డేవిడ్ వార్నర్ (19) ఔట్కావడంతో పవర్ప్లేలో డీసీ 32/4 స్కోరు మాత్రమే చేసింది. తర్వాత అక్షర్ పటేల్ (21), అమన్ హకీమ్ ఖాన్ (18) కాసేపు పోరాడినా, అభిషేక్ పోరెల్ (5), లలిత్ యాదవ్ (4) సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. చివర్లో కుల్దీప్ యాదవ్ (7 నాటౌట్) సపోర్ట్తో అన్రిచ్ (23 నాటౌట్) పోరాడే ప్రయత్నం చేసినా అప్పటికే రన్రేట్ పెరిగిపోవడంతో డీసీకి ఓటమి తప్పలేదు. పార్నెల్, హసరంగ, హర్షల్ తలో వికెట్ తీశారు.