ముంబై: వరుసగా ఐదో రోజు అయిన సోమవారం కూడా మార్కెట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 2.20 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ- లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 391 లక్షల కోట్లకు చేరుకుంది. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ బెంచ్మార్క్ 282 పాయింట్లు పెరిగి 72,708.16 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 81.55 పాయింట్లు లాభపడి 22,122.25 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ. 2,19,581.56 కోట్లు పెరిగి రూ.3,91,69,087.01 కోట్లకు చేరుకుంది.
సెన్సెక్స్ షేర్లలో బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, ఐటీసీ, నెస్లే లాభపడ్డాయి. ఎల్అండ్ టీ, విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్, టాటా మోటార్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 0.29 శాతం పెరగగా, బీఎస్ఈ స్మాల్క్యాప్ 0.77 శాతం లాభపడింది. బీఎస్ఈ లార్జ్ క్యాప్ 0.35 శాతం పెరిగింది.