ట్రేడింగ్ పేరుతో రూ.67 లక్షల ఫ్రాడ్ ...ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

ట్రేడింగ్ పేరుతో రూ.67 లక్షల ఫ్రాడ్ ...ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

బషీర్​బాగ్, వెలుగు: స్టాక్​ ట్రేడింగ్​ పేరుతో రూ.67 లక్షలు కొట్టేసిన ఇద్దరిని సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్​కు చెందిన దేవరాజ్ బాయ్ రామాణి, గొండలియ హార్దిక్ కుమార్ ఆన్​లైన్​లో మోసాలు చేస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన 57 ఏండ్ల ప్రైవేట్ ఉద్యోగిని స్టాక్ ట్రేడింగ్​లో టిప్స్ ఇస్తామని ఓ వాట్సప్ గ్రూప్ లో యాడ్ చేశారు. ఆయనను నమ్మించి రూ.67. 60 లక్షలు కాజేశారు. బాధితుడు ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ శివమారుతి తెలిపారు.

డైమండ్స్​ పంపిస్తున్నామని నమ్మించి..

కొరియర్​లో డైమండ్స్, గోల్డ్ పంపిస్తున్నట్లు నమ్మించి ఓ యువకుడిని సైబర్ చీటర్లు మోసగించారు. తొలుత ఆసిఫ్ నగర్​కు చెందిన 27 ఏండ్ల యువకుడికి వాట్సాప్​లో మెసేజ్​​ పంపారు. తాము యూకేలో ఉంటున్నామని, ఇండియన్స్​కు గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటామని నమ్మించారు.

 డైమండ్స్, గోల్డ్, క్లాత్స్, డబ్బులు పార్శిల్ పంపిస్తున్నట్లు ఓ ఫొటో షేర్ చేశాడు. పార్శిల్​ను​ ముంబైలో కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని కథ అల్లారు. కస్టమ్స్ చార్జీల పేరుతో రూ.2.48 లక్షలువసూలు చేశారు. ఆ తర్వాత నంబర్​ బ్లాక్​ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.