హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ జాతీయ సెంట్రల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో లోక్సభ టికెట్ల పంపకం, సీట్ల కేటాయింపుపై చర్చించారు. నాగర్కర్నూల్, ఆదిలాబాద్, హైదరాబాద్ లోక్సభ స్థానాలను ఆర్ఎస్పీ అడుగుతున్నట్టు తెలిసింది. ఇందుకు కేసీఆర్ కూడా అంగీకరించినట్టు బీఎస్పీ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్తో జరిగిన సమావేశంలో బీఎస్పీ తెలంగాణ సెంట్రల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు తదితరులు పాల్గొన్నారు.
మాయావతి పర్మిషన్తోనే
రాష్ట్రంలో బీఎస్పీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే స్థానాలపై బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతితో చర్చించిన తర్వాతే కీలక ప్రకటన చేయనున్నట్టు పార్టీ కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరిందని ఆయన తెలిపారు. బీఎస్పీ పోటీ చేసే స్థానాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.