హైదరాబాద్, వెలుగు: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. మెదక్ టికెట్ను రిటైర్డ్ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ శుక్రవారం మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, నాయకులతో ఎర్రవల్లిలోని ఫామ్హౌస్ లో సమావేశం నిర్వహించారు. అనంతరం మెదక్ టికెట్ను వెంకట్రామిరెడ్డికి, నాగర్కర్నూల్ సీటును ఆర్ఎస్పీకి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండింటితో కలిపి ఇప్పటివరకు 13 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.
సికింద్రాబాద్ రేసు నుంచి తలసాని సాయికిరణ్ యాదవ్ తప్పుకోవడంతో, అక్కడి నుంచి పోటీచేయాలని ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ను కేసీఆర్ కోరారు. కానీ, అందుకు ఆయన సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో అంబర్పేట్ నియోజకవర్గానికి చెందిన కాంట్రాక్టర్ ఎడ్ల సుధాకర్రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. భువనగిరి సీటును షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, క్యామ మల్లేశ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే విజయ్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా భువనగిరి టికెట్ అడుగుతున్నారు. నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి రేసులో ఉన్నారు. ఇక్కడి నుంచి చెరుకు సుధాకర్ పేరు కూడా వినిపిస్తోంది.