
మునిపల్లి, వెలుగు: ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు బుధవారం ఉదయం మక్త క్యాసారం వెళ్లి, విద్యార్థులు, ప్రయాణికులు 60 మందిని సదాశివపేటకు తీసుకెళ్తోంది. పెద్దలోడి శివారులోకి రాగానే రోడ్డుపై గుంతను, ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.
ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సును రోడ్డుపైకి ఎక్కించే క్రమంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. డిపో మేనేజర్ ఉపేందర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డు బాగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు.