
- ఆపరేషన్ స్పైడర్ వెబ్ వివరాలు వెల్లడించిన జెలెన్ స్కీ
- ఈ దాడి సంతృప్తినిచ్చిందన్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్
- యుద్ధం కొనసాగించాలని తాము కోరుకోవట్లేదని వెల్లడి
- కాల్పుల విరమణ ప్రతిపాదించినా రష్యా ఒప్పుకోలేదని వివరణ
కీవ్: రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగించాలన్నది తమ అభిమతం కాదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ పేర్కొన్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో తాము కాల్పుల విరమణ ప్రతిపాదన చేశామని, రష్యానే ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఇస్తాంబుల్ వేదికగా రష్యాతో శాంతి చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఆదివారం రష్యా భూభాగంలోని పలు కీలక ఎయిర్ బేస్ లపై దాడికి సంబంధించిన కీలక వివరాలను జెలెన్ స్కీ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘ఏడాదిన్నర పాటు ప్లాన్ చేసి, 117 డ్రోన్లతో పర్ ఫెక్ట్ గా అమలు చేశాం’ అని జెలెన్ స్కీ చెప్పారు. తమ సెక్యూరిటీ సర్వీస్ బలగాలు పక్కాగా ప్లాన్ చేసి డ్రోన్లను రష్యా భూభాగంలోకి పంపించాయని, ఆపై కీలక ఎయిర్ బేస్ లపై పకడ్భందీగా దాడులు నిర్వహించాయని చెప్పారు.
శత్రువు భూభాగంలో దాడులు చేయడం, అది కూడా మా భూభాగంపై దాడులకు ఉపయోగిస్తున్న బాంబర్లను ధ్వంసం చేయడం చాలా సంతృప్తిని కలిగించిందని జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యాకు చెందిన మిలటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశామని ప్రకటించారు. ఈ ఆపరేషన్ అద్భుతమని, ఇందులో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ సేఫ్ గా రష్యా భూభాగం నుంచి బయటకు వచ్చేశారని వివరించారు. కాగా, రష్యా భారీ ఎత్తున వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ పౌరులను జెలెన్ స్కీ హెచ్చరించారు.
రష్యాపై ఒత్తిడి తీస్కరావాలె..
రష్యాపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారు. ఊహల్లో ఉన్న రష్యాను వాస్తవంలోకి రప్పించడానికి ఆంక్షలతో, చర్చలతో, సైనిక బల ప్రదర్శనతో ఒత్తిడి చేయాలని అన్నారు. కాల్పుల విరమణకు రష్యాను ఒప్పించేందుకు అన్నివైపుల నుంచి ఒత్తిడి పెంచాలని జెలెన్ స్కీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.