ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్కు 15 కిలోమీటర్ల చేరువలోకి రష్యా బలగాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని కీవ్ను రష్యా సైన్యం చుట్టుముట్టడంపై ప్రెసిడెంట్ జెలెన్ స్కీ స్పందించారు. కార్పెట్ బాంబింగ్తో ప్రాంత చరిత్రను తుడిచేయాలని చూస్తున్నారని, ఉక్రెయిన్ను నాశనం చేసి కీవ్లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కీవ్లో రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ నుంచి పారిపోతున్న సాధారణ ప్రజలపై కూడా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు. రష్యా దాడుల్లో ఓ చిన్నారి సహా ఏడుగురు మరణించారని వెల్లడించారు. ఉక్రెయిన్లోని చాలా వరకు చిన్న నగరాలు ధ్వంసమైపోయాయని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లోని ఓ దేశంపై జరిగిన అతిపెద్ద దాడిగా దీన్ని అభివర్ణించారు.
ఇదిలా ఉంటే రష్యా మాత్రం తాము ఇప్పటి వరకు ప్రజలను టార్గెట్ చేయలేదని వాదిస్తోంది. తమ బలగాలు చుట్టుముట్టిన నగరాల నుంచి ప్రజలను బయటకు తీసుకెళ్లడంలో ఉక్రెయిన్ విఫళమైందని అంటోంది. ప్రజలను సురక్షితంగా తరలించకపోవడం ఆ దేశం తప్పే అని అంటోంది.