
- ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి: ఉక్రెయిన్
- 277 డ్రోన్లు, 19 మిసైల్స్ ను కూల్చేశామని ప్రకటన
కీవ్: తమ ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై దాడిచేసిన ఉక్రెయిన్పై రష్యా ప్రతీకారం తీర్చుకుంటున్నది. ఇందులో భాగంగా రాత్రికి రాత్రే ఉక్రెయిన్పై విరుచుకుపడింది. 479 డ్రోన్స్, 20 మిసైల్స్తో అటాక్ చేసింది. యుద్ధం మొదలైన నాటినుంచీ ఇదే పెద్ద దాడి అని ఉక్రెయిన్ సోమవారం వెల్లడించింది. డ్రోన్లతో పాటు వివిధ రకాల 20 మిసైల్స్ను దేశంలోని వివిధ ప్రాంతాలపై ప్రయోగించారని ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది. ఈ దాడి ప్రధానంగా ఉక్రెయిన్లోని మధ్య, పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. రష్యా ప్రయోగించిన వాటిల్లో 277 డ్రోన్లు, 19 మిసైల్స్ను మార్గం మధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొన్నది. కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే టార్గెట్స్ను తాకినట్టు వెల్లడించింది.
డ్రోన్ దాడికి రష్యా ప్రత్యేక వ్యూహం
యుద్ధం మొదలైననాటినుంచి ఉక్రెయిన్పై దాడికి రష్యా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ఏరియల్ అటాక్స్ను సాయంత్రంపూట ప్రారంభించి.. తెల్లవారుజాము వరకు కొనసాగిస్తున్నది. చీకట్లో డ్రోన్లను గుర్తించడం చాలా కష్టమైన నేపథ్యంలో రష్యా ఈ పంథాను ఎంచుకున్నది. మూడేండ్లకు పైగా జరిగిన యుద్ధంలో రష్యా షాహెద్ డ్రోన్లతో ఉక్రెయిన్లోని పౌర ప్రాంతాలను దెబ్బతీసింది. ఈ దాడుల్లో 12 వేల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మృతిచెందినట్టు యునైటెడ్ నేషన్స్ తెలిపింది. కాగా, తాము పౌర ప్రాంతాలపై కాకుండా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని రష్యా వాదిస్తున్నది.