- పంట సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం.. తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
- గత సర్కారులా కాకుండా దుబారాకు చెక్పెట్టాలని నిర్ణయం
- కౌలు రైతులకూ రైతుబంధు, రైతు బీమా వర్తింపు
- రూ.2 లక్షల రైతు రుణమాఫీపైనా కార్యాచరణ షురూ
- పెట్టుబడి సాయం ఎకరానికి రూ.15 వేలకు పెంపు
- బెంగాల్ తరహా పంటల బీమా అమలుకు నిర్ణయం
- బడ్జెట్లో ఎవుసానికి రూ.19,746 కోట్లు కేటాయించిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు (రైతు భరోసా) ఇవ్వబోమని, పంట సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బడ్జెట్లో వ్యవసాయానికి రూ.19,746 కోట్లు ప్రతిపాదించింది. గత సర్కారు అమలు చేసిన రైతుబంధు పథకంలో అసలు రైతుల కంటే పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందడంపై సమీక్షించనున్నట్లు తెలిపింది. వందల ఎకరాలున్న భూస్వాములు, సెలబ్రిటీలు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కోట్లాది ఆస్తులున్న వారికి రైతుభరోసా ఇవ్వకూడదని సర్కారు నిర్ణయించింది. సాగు చేయని భూములు, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు పెట్టుబడి దారులకు,రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేల ఎకరాలకు గత సర్కారు రైతుబంధు సాయం ఇచ్చిందని, పథకం జీవోకు విరుద్ధంగా ప్రభుత్వ డబ్బు దుబారా చేసిందని అభిప్రాయపడింది.
రైతుబంధు నిబంధనలను పున:సమీక్షించి అసలైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపింది. కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రూ.2 లక్షల రుణమాఫీ
రైతన్నలకు రుణమాఫీపై సర్కారు తీపి కబురు చెప్పింది. తాజా బడ్జెట్లో రూ.2 లక్ష పంట రుణాల మాఫీకి పచ్చజెండా ఊపింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని సర్కారు ప్రకటించింది. రుణమాఫీ విధివిధానాలు రూపొందించి త్వరలోనే కార్యాచరణ మొదలు పెడుతామని స్పష్టం చేసింది.
.
బీమా లేక నష్టపోయిన రైతులు
ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం నుంచి 2020లో నాటి బీఆర్ఎస్సర్కారు వైదొలిగింది. ఆ తర్వాతి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడంలేదు. మూడేళ్లుగా పంటల బీమా లేకపోవడంతో రైతులు వందల కోట్ల రూపాయలు నష్టపోయారు. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లలో 9 లక్షల ఎకరాల్లో, 2021–22లో దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. గత వానాకాలం సీజన్లో మార్చి, ఏప్రిల్ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. దాదాపు10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా తేల్చగా, చివరకు 2.30 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్లు తేల్చారు. ఎన్నికల టైమ్ కావడంతో ఆ ఒక్కసారికి మాత్రం ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. గత డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో తుఫాన్ కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు.
ప్రత్యేక విత్తన విధానం నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం త్వరలో ఒక కొత్త ‘విత్తన విధానం’ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. రైతులకు విత్తనాల సరఫరా, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి, రైతు వేదికలకు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు, మైక్రో ఇరిగేషన్ తదితరాలకు కూడా సర్కారు నిధులు ప్రతిపాదించింది. అంతేగాక వరికి క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ మేరకు ఈ ఏడాది నిధులు కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణపైనా దృష్టిసారించాలని నిర్ణయించింది.
లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు టార్గెట్
అయిల్ పామ్ సాగుకు సర్కారు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు బడ్జెట్ లో పేర్కొంది. రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఆయిల్ పామ్ మొక్కలు, ఎరువులు, డ్రిప్లకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయిపులు చేసింది. గత బీఆర్ఎస్ సర్కారు నిరుడు బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించగా నిధులు విడుదల చేయడంలో ఆసక్తి చూపలేదు. రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయక పోవడం వల్లే కేంద్రం నుంచి వచ్చే నిధులకు గండిపడింది.
వెస్ట్ బెంగాల్ తరహా పంటల బీమా
రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని, బెంగాల్ తరహా స్కీంను ప్రారంభించి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి అనుగుణంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘బంగ్లా సస్య బీమా యోజన’ను అమలు చేస్తోంది. ఆహార ధాన్యాలు, నూనె గింజల తదితర ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు మొత్తం ప్రీమియం బెంగాల్ ప్రభుత్వమే చెల్లిస్తోంది. చెరకు, ఆలుగడ్డ పంటలకు 4.85 శాతం ప్రీమియం రైతులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పోర్టల్లో సీజన్కు ముందు రైతులు క్రాప్ఇన్స్యూరెన్స్చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఇక్కడ సాధారణ రైతులతోపాటు, కౌలు రైతులకు కూడా పంటల బీమా అమలు అవుతున్నది.
రైతు భరోసా 5 ఎకరాలకే పరిమితం చేస్తే..
గత వానాకాలం సీజన్లో 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల భూమికి ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. వీరిలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉండగా, ఐదెకరాలోపు భూమి ఉన్న రైతులు 62.34 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో కోటి ఎకరాల భూమి ఉన్నది. ఇప్పటి వరకు రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో గుంట నుంచి ఐదెకరాలోపున్న రైతులే 90.36 శాతం ఉన్నారు. కాగా ఐదెకరాలకు పైగా భూములున్న రైతులు కేవలం 6.65 లక్షలే ఉన్నారు. కానీ వీరి చేతిలో ఏకంగా 52 లక్షల ఎకరాల భూమి ఉన్నది. పంట పెట్టుబడి సాయాన్ని సర్కారు ఐదెకరాలకే పరిమితం చేస్తే భారీగా వృథా తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడున్నట్లు1.52 కోట్ల ఎకరాలకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తే రూ. 22,800 కోట్లు అవసరం అవుతాయి. కానీ అలా కాకుండా కేవలం 5 ఎకరాలకు పరిమితం చేస్తే రూ.15 వేల కోట్లు సరిపోయే అవకాశం ఉంది. అంటే రూ.7,800 కోట్లు ఆదా అవుతాయి. 90 శాతం మంది రైతులకు రైతుభరోసా కూడా దక్కుతుంది.