
- కొత్తగా అప్లై చేసుకునేందుకు ఈ నెల 20 లాస్ట్ డేట్
- గత సీజన్లో అందని 27 వేల మంది నుంచి సైతం అప్లికేషన్లు తీసుకున్న ఆఫీసర్లు
- వెరిఫికేషన్ పూర్తి కాగానే రైతుల అకౌంట్లలో నగదు జమ
మంచిర్యాల, వెలుగు : కొత్తగా పట్టాదారు పాస్బుక్స్ పొందిన రైతులకు సైతం 2025–26 వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా అందనుంది. ఈ ఏడాది జూన్ ఐదు వరకు పాస్బుక్స్ పొందిన రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా అప్లికేషన్లు తీసుకుంటోంది. రైతులు పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు జిరాక్స్లతో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల వద్ద అప్లై చేసుకోవాలి. రైతు భరోసా అప్లికేషన్లకు ఈ నెల 20 వరకు గడువు ఉండగా, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.43 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్లను మొదట ఏఈవోలు, తర్వాత మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు పరిశీలించి రిపోర్టు ఇవ్వనున్నారు. దాని ఆధారంగా రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ కానున్నాయి.
సంగారెడ్డిలో అత్యధికం
రైతు భరోసా కోసం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,42,947 అప్లికేషన్లు రాగా.. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 12,080, రంగారెడ్డిలో 11,913, వికారాబాద్లో 9,643, నల్గొండ జిల్లాలో 9,506 అప్లికేషన్లు వచ్చాయి. ఈ జిల్లాల్లో ఫామ్ ల్యాండ్స్ పేరిట గుంటల విస్తీర్ణంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. దీని వల్లే కొత్తగా జారీ అయిన పట్టా పాస్బుక్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ విస్తీర్ణం ఆ స్థాయిలో ఉండకపోవచ్చని సమాచారం. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 1,869, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 1,620, మంచిర్యాలలో 3,462, నిర్మల్లో 3,045, నిజామాబాద్లో 4,617, కామారెడ్డిలో 5,843 అప్లికేషన్లు వచ్చాయి.
అలాగే కరీంనగర్లో 3,001, పెద్దపల్లిలో 2,418, జగిత్యాలలో 3,769, రాజన్న సిరిసిల్లలో 1,973, మెదక్లో 6,558, సిద్దిపేటలో 6,816, వరంగల్లో 2,203, హన్మకొండలో 2,355, మహబూబాబాద్లో 2,389, ములుగులో 664 మంది రైతులు అప్లై చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,110, జనగాంలో 3,204, ఖమ్మంలో 4,693, భద్రాద్రి కొత్తగూడెంలో 1,023, మేడ్చల్ మల్కాజ్గిరిలో 1,046, మహబూబ్నగర్లో 6,720, నారాయణపేట్లో 4,955, నాగర్కర్నూల్లో 6,686, వనపర్తిలో 3,625, జోగులాంబ గద్వాలలో 4,007, సూర్యాపేటలో 5,043, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,091 దరఖాస్తులు వచ్చాయి.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో మొత్తం 3,462 అప్లికేషన్లు రాగా, బెల్లంపల్లి మండలంలో 98, భీమారంలో 115, భీమినిలో 170, చెన్నూరులో 212, దండేపల్లిలో 291, హాజీపూర్లో 256 అప్లికేషన్లు వచ్చాయి. అలాగే జైపూర్ మండలంలో 770, జన్నారంలో 268, కన్నెపల్లిలో 142, కాసిపేటలో 91, కోటపల్లిలో 208, లక్సెట్టిపేటలో 299, మంచిర్యాలలో 65, మందమర్రిలో 103, నస్పూర్ మండలంలో 22 అప్లికేషన్లు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.
గత సీజన్లో రాని వాళ్లకు సైతం
పట్టాదార్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్, ఆధార్ కార్డు వివరాలు సరిగా లేకపోవడం, ఇతర కారణాలతో గత సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 27,208 మందికి రైతు భరోసా అందలేదు. వీరికి కూడా ఈ సీజన్లో రైతుభరోసా ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకున్నారు. రెండూ కలిపి 1,70,217 అప్లికేషన్లు రాగా.. ఏఈవోలు ఇప్పటివరకు 7,161 దరఖాస్తులను వెరిఫై చేశారు. ఎంఏవోలు 1,868 పరిశీలించగా.. వారి దగ్గర మరో 5,293 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే అర్హులైన రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమవుతాయని ఆఫీసర్లు తెలిపారు.