- 2020-21 లో రూ. 100 కోట్లను క్రాస్ చేసిన వీరి మొత్తం శాలరీ
- స్టాక్ ఆప్షన్లు, బోనస్లతో భారీగా సంపాదన..
సబ్బులు, షాంపులు వంటి ప్రొడక్ట్లను అమ్మే కంపెనీలు తమ సీఈఓలకు 2020–21 లో భారీగా జీతాలు చెల్లించాయి. దేశంలోని టాప్ 10 ఎఫ్ఎంసీజీ కంపెనీల సీఈఓల శాలరీలు మొత్తం కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ. 106 కోట్లకు చేరుకుంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఈ వాల్యు రూ. 93 కోట్లుగా ఉంది. వీరి శాలరీలు, కాంపెన్సేషన్ ప్యాకేజి ( స్టాక్ ఆప్షన్లు, బోనస్లు వంటివి) కరోనా ముందు స్థాయికి చేరుకోవడం విశేషం. నెస్లే ఇండియా చైర్మన్ సురేష్ నారాయణన్ ఎక్కువ జీతాన్ని అందుకున్నారు. కరోనా సంక్షోభ టైమ్లో ప్యాకేజ్డ్ ఫుడ్స్కు విపరీతమైన డిమాండ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ కంపెనీ సీఈఓ శాలరీ హిందుస్తాన్ యూనిలీవర్ చైర్మన్ శాలరీని దాటేసింది. నెస్లే యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం 2020 లో సురేష్ నారాయణన్ శాలరీ 6.3 శాతం పెరిగి రూ. 17.19 కోట్లకు చేరుకుంది. నెస్లే జనవరి–డిసెంబర్ను అకౌంటింగ్ ఇయర్గా ఫాలో అవుతోంది.
బోనస్లు, స్టాక్ ఆప్షన్లతోనూ..
టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీలు టాప్ ఎగ్జిక్యూటివ్లకు స్టాక్ ఆప్షన్లు, ఇతర మార్గాల్లో బాగానే కాంపన్సేషన్ ప్యాకేజిలను అందించాయి. టాటా కన్జూమర్స్ ప్రొడక్ట్స్ సీఈఓ సునీల్ డిసౌజా కాంపెన్సేషన్ ప్యాకేజి కింద 2020–21లో రూ. 10.49 కోట్లను అందుకున్నారు. ముందు ఇదే పొజిషన్లో సేవలందించిన అజయ్ మిశ్రాకు రూ. 4.3 కోట్ల విలువైన కాంపెన్సేషన్ ప్యాకేజి అందింది. మిగిలిన ఎఫ్ఎంసీజీ సీఈఓల శాలరీలు పెరిగితే, హెచ్యూఎల్ మాత్రం తన కంపెనీ సీఈఓ శాలరీని 2020–21 లో 21 శాతం తగ్గించింది. కరోనా సంక్షోభం వలన ఈ కంపెనీ 2020 లో అనేక సమస్యలను ఎదుర్కొంది. సప్లయ్ చెయిన్, ఇన్వెంటరీలను మేనేజ్ చేయడం, ఫ్యాక్టరీలలో ప్రొడక్షన్ను పెంచుకోవడం వంటి అంశాల్లో ఇబ్బంది పడింది. గత రెండేళ్ల నుంచి ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఇస్తున్న కాంపెన్సేషన్లు నిలకడగా పెరుగుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
దేశంలోని రిచెస్ట్ సీఈఓ..
డిమార్ట్ సీఈఓ నవిల్ నోరోన్హా దేశంలోని రిచెస్ట్ నాన్ ప్రమోటర్ సీఈఓగా నిలిచారు. ఆయన సంపద టాప్ కంపెనీల సీఈఓలను దాటేయడం విశేషం. నోరోన్హా సంపద కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ. 5,146 కోట్లకు పెరిగింది. డీమార్ట్ స్టోర్లను ఆపరేట్ చేస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ షేర్లు గత ఏడాది మార్చి కనిష్టాల నుంచి 116 శాతం పెరిగాయి. ఈ కంపెనీలో నోరోన్హాకు 2.03 శాతం వాటా ఉంది. దీంతో ఆయన సంపద కూడా అమాంతం పెరిగింది. టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని సంపద రూ. 1,000 కోట్లకు పైన ఉంది. అవెన్యూ సూపర్ మార్ట్స్ సీఎఫ్ఓ రమాకాంత్ బహేటి సంపద రూ. 1,074 కోట్లకు చేరుకుంది.