- బండ్ల ధరలు పెరగడం, ఆదాయాలు మెరుగవ్వకపోవడమే కారణం
- కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోని మెజార్టీ ప్రజలు
బిజినెస్ డెస్క్, వెలుగు: హీరో హెచ్ఎఫ్ డీలక్స్, బజాజ్ ప్లాటినమ్, టీవీఎస్ సోర్ట్స్ వంటి ఎంట్రీ లెవెల్ టూ వీలర్ల సేల్స్ భారీగా పడుతున్నాయి. ఒకప్పుడు 110 సీసీ లోపు ఉన్న మొత్తం టూ వీలర్ సేల్స్లో వీటి వాటానే 90 శాతం వరకు ఉండేది. ప్రస్తుతం వీటి అమ్మకాలు దిగాలుగా ఉన్నాయి. దేశంలో కార్ల సేల్స్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా టూ వీలర్ సేల్స్ జరుగుతాయి.
ఎకానమీలో కింది స్థాయిలో ఉన్నవారే టూ వీలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందుకే వీటి అమ్మకాలు బాగుంటే ఎకానమీ మెరుగుపడుతోందని అంటుంటారు నిపుణులు. ఈ ఏడాది దీపావళి టైమ్లో ఆటో కంపెనీల సేల్స్ పుంజుకున్నాయి. కానీ, ఈ టైమ్లో కూడా టూ వీలర్ అమ్మకాలు 2021 లెవెల్తో పోలిస్తే తక్కువగా జరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొటివ్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు.
దీపావళి టైమ్లో కొంత ఇన్వెంటరీ తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన టూ వీలర్ అమ్మకాలు గత 10 ఏళ్లలోనే తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. టూ వీలర్ సెగ్మెంట్లో 110 సీసీ వరకు ఉన్న బండ్ల అమ్మకాలు ఏకంగా 35 శాతం (2018–19, జులై–సెప్టెంబర్ క్వార్టర్ తో పోలిస్తే) పడ్డాయని మీనన్ వివరించారు. అదే మోపెడ్ల సేల్స్ అయితే ఏకంగా 51 శాతం తగ్గాయని అన్నారు.
పాత బండ్లతోనే నెట్టుకొస్తున్నారు..
ఎంట్రీ లెవెల్ టూ వీలర్ల సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణం గత కొన్నేళ్లలో టూ వీలర్ల ధరలు విపరీతంగా పెరగడమే. 110 సీసీ లోపు ఉన్న బండ్లను సాధారణంగా చిన్న వ్యాపారులు, రోజు వారి వేతనాలపై జీవించే వారు, రైతులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. గత నాలుగైదేళ్ల నుంచి టూ వీలర్ల ధరలు పెరిగినంత వేగంగా వీరి కొనుగోలు
సామర్ధ్యం పెరగలేదు. పదేళ్ల క్రితం
స్ప్లెం డర్ ప్రో ధర రూ. 50 వేలు ఉండేదని, ప్రస్తుతం ఈ బైక్కు పోలిన స్ప్లెం డర్ ప్లస్ ధర రూ.87 వేలుగా (ఆన్ రోడ్) ఉందని నల్గొండ రైతు ఒకరు పేర్కొన్నారు. ఇది సుమారు 75 శాతం పెరుగుదల. ఈ పెరిగిన రేట్లను సాధారణ రైతులు, రోజువారీ కూలీలు భరించలేకపోతున్నారు. ‘కొత్త మోటార్సైకిల్ తీసుకుందామని అనుకున్నా. కానీ, ఎలా కొనాలి? ఒకవేళ ఫైనాన్స్ తీసుకున్నా బండి ధర కనీసం రూ. లక్ష అవుతుంది.
రోజుకి 100–150 కి.మీ ప్రయాణిస్తే రూ.200 పెట్రోల్కి ఖర్చు చేయాలి. ఎలక్ట్రిక్ టూ వీలర్ కొంటే ఈ రేంజ్లోనే సింగిల్ ఛార్జింగ్తో ప్రయాణించొచ్చు. కానీ, ఈ రెండు రకాల బండ్లలో ఏది కొనడానికైనా నా దగ్గర డబ్బులు లేవు’ అని పైన పేర్కొన్న రైతు వివరించారు. కేవలం ఈయన ఒక్కరే కాదు. ఇన్ఫ్లేషన్ పెరగడం వలన, ఆదాయాలు పడిపోవడం వలన చాలా మంది టూ వీలర్ కన్జూమర్లు తమ కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు.
కరోనా వలన గత రెండేళ్లలో సరిగ్గా బిజినెస్ జరగలేదని, ఇప్పుడిప్పుడే బిజినెస్ రికవరీ అవుతున్నా ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదని టీ అమ్ముకునే రాము అన్నారు. వ్యవస్థలోని మెజార్టీ ప్రజలు ఇంకా కరోనా సమస్యల నుంచి రికవరీ కాలేదు. ‘ కరోనా టైమ్లో పట్టణాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో 40 % మంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వీరు ఎలా సంక్షోభాన్ని తట్టుకోగలిగారు? చిన్న వ్యాపారులు, సొంతంగా పనిచేసుకునే లేబరర్స్ ఇలా చాలా మంది తమ సేవింగ్స్ను కరోనా టైమ్లో ఖాళీ చేసేశారు.
కొంత మంది అప్పులు తీసుకొని, మరికొంత మంది తమ ఆస్తులను అమ్ముకొని సంక్షోభ టైమ్ను దాటారు. వీరు ఇప్పుడు సంపాదిస్తున్న ఆదాయం గూడ్స్, సర్వీస్లు కొనడానికి వాడే పొజిషన్లో లేరు. కరోనా సమస్యల నుంచి వీరు ఇంకా బయటపడలేదు’ అని ప్రైస్ ఎకనామిస్ట్ రాజేష్ శుక్లా అన్నారు.
ఎలక్ట్రిక్ మారుతుండడం..
టూ వీలర్లను కొనుగోలు చేసే సామర్ద్యం ఉన్నవాళ్లు 125 సీసీ కంటే పెద్ద బైక్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. లేదా ఎలక్ట్రిక్ టూ వీలర్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, అంపీయర్, కైన్టిక్ గ్రీన్, డైనమో, రైటో ఎలక్ట్రిక్స్, బిర్లా ఈ–బైక్ వంటి బ్రాండ్లు దేశంలో అన్ని కార్నర్లకు విస్తరిస్తున్నాయి. ఇంకా ఎంట్రీ లెవెల్ టూ వీలర్ల మాదిరే రేట్లు కూడా ఉండడం, పెట్రోల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వైపు షిఫ్ట్ అవుతున్నారు. కానీ, ఎలక్ట్రిక్ టూ వీలర్ల పార్టులు అంతగా దొరకకపోవడం, ఛార్జింగ్, బ్యాటరీ సమస్యలు ఉండడంతో వీటి సేల్స్ కూడా పెద్దగా ఏం లేవని డీలర్లు చెబుతున్నారు.