
క్యాష్రిచ్ లీగ్గా పేరొందిన ఐపీఎల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ విదితమే. శక్తికి మించి పోరాడటమే కాదు.. విజయం కోసం ఆఖరి బంతి వరకూ శ్రమిస్తారు. కానీ ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి ఆ పోరాటపటిమ కనిపించడం లేదు. బౌలర్లు, బ్యాటర్లు ఏ ఒక్కరూ రాణించడం లేదు. సమిష్టిగా విఫలమవుతున్నారు. వీరి ప్రదర్శన అభిమానులకు కూడా నచ్చడం లేదు. 'ఐపీఎల్లో చూపించే తెగువ.. దేశం కోసం ఆడే సమయంలో కనిపించడం లేదని వారు వాపోతున్నారు'.
ఐసీసీ ట్రోఫీ గెలిచి దశాబ్దకాలం..
ఆటగాళ్ల ప్రదర్శన పక్కనపెడితే.. ఐసీసీ టోర్నీలు టీమిండియాకు కలిసి రావడం లేదు అన్నది వాస్తవం. కెప్టెన్ మారినా.. కొత్త కోచ్ వచ్చినా ఫలితంలో మాత్రం మార్పు ఉండటం లేదు. వరుసగా తొమ్మిది సార్లు టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం(2013) ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా ఓటమిపాలవుతోంది.
2014 టీ20 ప్రపంచకప్ లో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి భారత జట్టు.. అనుకున్నట్టుగానే ఫైనల్ చేరింది. కానీ ఫైనల్లో అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడింది. ఆ తరువాత 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలవ్వగా, 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఆ తరువాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాయాదీ పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పాక్ చేతిలో ఏకంగా 180 పరుగుల తేడాతో ఓడి భారత అభిమానులను తలెత్తుకోకుండా చేసింది.
ఆ తరువాత 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా, 2019-21 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ అదే జట్టు చేతిలో మరోసారి భంగపోయింది. ఇక అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారిపట్టిన టీమిండియా.. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియాతో జరిగిన 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూసింది.
ఈ ఓటములకు బాధ్యులెవ్వరో అభిమానులకు అర్థమవ్వడం లేదు. ద్వైపాక్షిక సిరీసుల్లో రాణించే ఆటగాళ్లు.. ఐసీసీ టోర్నీల్లో ఎందుకు విఫలమవుతున్నారో అంతు పట్టడం లేదు. ప్రాంచైజీ క్రికెట్ వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతోందా? అన్నది కొత్త ప్రశ్న. వీటన్నిటికీ బీసీసీఐయే సమాధానం చెప్పాలి.