సుహాస్, శివానీ నాగారం జంటగా గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బల్వంత్’. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈనెల 20న విడుదల చేస్తున్నారు. మంగళవారం ‘నాట్ ఏ టైటిల్’ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘కథను నమ్మి నిజాయితీగా కష్టపడతాడు సుహాస్. ఈ సినిమాకు టైటిల్ మారినప్పటికీ దీన్నంతా సుహాస్ సినిమా అంటారు. ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడు' అని అన్నారు. హీరో సుహాస్ మాట్లాడుతూ ‘‘మజిలీ’ చిత్రంతో నటుడిగా నాకు బ్రేక్ వచ్చింది.
ఆ సమయంలో ఓ పెద్ద హీరోయిన్తో క్లోజ్గా ఉండే పాత్ర వస్తే, సెట్లో ఒకరు ఇతన్నెందుకు పిలిచారంటూ అవమానించారు. కట్ చేస్తే కీర్తి సురేష్ లాంటి పెద్ద హీరోయిన్తో ‘ఉప్పు కప్పురంబు’లో నటించా. నేను గ్రేట్గా ఫీలయిన మూమెంట్ అది. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నవ్వి ఊరుకోండి.. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఇక ‘హే బల్వంత్’ చిత్రంతో పెద్ద హిట్ వస్తుందని నమ్ముతున్నా’ అని అన్నారు. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఉన్న సినిమా అని శివానీ చెప్పింది.
వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘రిలీజ్ డేట్లు మారినా, టైటిల్ మారినా మా సినిమా క్రియేట్ చేసే ఇంపాక్ట్ మారదు. వినోదం, ఎమోషన్ ఉన్న హోల్ సమ్ ఎంటర్టైనర్ ఇది. ప్రేక్షకులకు పైసా వసూల్ సినిమా’ అని చెప్పారు. ‘మారింది టైటిలే. కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కాదు’ అని దర్శకనిర్మాతలు తెలియజేశారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.
