
రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'స్పిరిట్' ( Spirit ) చిత్రం షూటింగ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తొలుత 2025 సెప్టెంబర్లో చిత్రీకరణ ప్రారంభించాలని భావించినా, ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం దీనికి కారణంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ యాక్షన్ డ్రామా షూటింగ్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమాకు ఇంకా మూడు పాటలు, ఒక యాక్షన్ సన్నివేశం మిగిలి ఉందని సమాచారం. దీనితో పాటు, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజా సాబ్' సినిమా షూటింగ్ కూడా కొనసాగుతోంది. ఈ కారణాల వల్ల ప్రభాస్ సెప్టెంబర్ నాటికి 'స్పిరిట్' షూటింగ్ ప్రారంభించడానికి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే, సందీప్ రెడ్డి వంగా మాత్రం తన సినిమా డేట్స్ ప్రకారం షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారని టాక్ ఉంది. ఈ షూటింగ్ షెడ్యూల్ గురించి నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ అండర్వరల్డ్ సామ్రాజ్యాన్ని కూల్చే మిషన్తో కూడిన క్రూరమైన పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. 'యానిమల్' సినిమా విజయంతో సందీప్ రెడ్డి వంగాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను 9 భాషల్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్ నటి తృప్తి డిమ్రీ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించనున్నారు. 'స్పిరిట్' షూటింగ్ ఆలస్యమైతే, విడుదల కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, మారుతి దర్శకత్వంలో వస్తున్న 'ది రాజా సాబ్' చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నయనతార, కియారా అద్వానీ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2025 డిసెంబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.