తండ్రితో పాటు కాంగ్రెస్​ పార్టీలో చేరిన సంజయ్, సీనియర్ ​లీడర్లు 

తండ్రితో పాటు కాంగ్రెస్​ పార్టీలో చేరిన సంజయ్, సీనియర్ ​లీడర్లు 

నిజామాబాద్, వెలుగు:  కాంగ్రెస్ పార్టీ మాజీ నేత డి. శ్రీనివాస్   ఘర్​వాపసీతో జిల్లా బీఆర్ఎస్​లో  బుగులు  మొదలైంది.  కొంతకాలంగా బీఆర్ఎస్​ కు దూరంగా ఉంటున్న డీఎస్​ ఎట్టకేలకు  ఆదివారం కాంగ్రెస్​లో చేరడంతో జిల్లాలో  రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ  ప్రెసిడెంట్​గా  ఓ వెలుగు వెలిగిన డీఎస్​ రీ ఎంట్రీ తో జిల్లాలో  పార్టీల బలా బలాలు మారుతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికలకు  ఏడు నెలలే గడువు ఉండడం, బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న  నేపథ్యంలో  డీఎస్ ఎఫెక్ట్​ బీఆర్ఎస్​ కు  ప్రతికూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
 

కో ఆర్డినేషన్​లో కీ రోల్​..

సీనియర్​నేత డీఎస్​ ఆయన పెద్ద కొడుకు సంజయ్ ఆదివారం  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల  ఇన్​చార్జి  మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు  పీసీసీ  ప్రెసిడెంట్ గా 2004, 2009  ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి  తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్​కు మంచి సమన్వయ కర్తగా పేరుంది.  ప్రస్తుతం అనారోగ్య కారణాలతో డీఎస్​వీల్​చైర్​కు పరిమితమైనా.. పార్టీలో సీనియర్లు, అసమ్మతి నేతల మధ్య  సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ ​హైకమాండ్​భావిస్తోంది. 

అర్వింద్​కు సహకరిస్తున్నారని..

త చిన్న కుమారుడు అర్వింద్ కు సహకరిస్తున్నారని జిల్లా బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు,  అప్పటి నిజామాబాద్ ​ఎంపీ  కవిత పార్టీ  హైకమాండ్​కు కంప్లైంట్​చేశారు. డీఎస్​పై  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. ఈ పరిణామాలతో డీఎస్​బీఆర్ఎస్​ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.  కానీ 2019 లో పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ తరఫున నిజామాబాద్​  ఎంపీగా బరిలో దిగిన అర్వింద్ గెలుపులో  డీఎస్​ కీలక భూమిక పోషించారు. 

5 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం

ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ  సెగ్మెంట్లు ఉండగా, ఐదింటిలో  బీసీల్లో కీలకమైన మున్నూరు కాపు సామాజిక వర్గం అభ్యర్థులు గెలుస్తున్నారు.  నిజామాబాద్​అర్బన్​, నిజామాబాద్​రూరల్​, బోధన్ , ఆర్మూర్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్మూర్​, నిజామాబాద్​రూరల్​ నుంచి బాజిరెడ్డి ,  అర్బన్​ నుంచి మూడు సార్లు డీఎస్​, ఎల్లారెడ్డి నుంచి  మూడు సార్లు  నేరెళ్ల ఆంజనేయులు  గెలుపొందారు.

2015 లో డీఎస్​ బీఆర్ఎస్​లో చేరడంతో మున్నూరు కాపులు కాంగ్రెస్​ కు దూరమైనట్లు స్పష్టంగా కనిపించింది. 2018 ఎన్నికల్లో మున్నూరు కాపు వర్గానికి చెందిన బాజిరెడ్డి  గోవర్ధన్​రూరల్, ఎల్లారెడ్డి  నుంచి జాజాల సురేందర్ గెలిచారు. 2019 ఎన్నికల్లో మున్నూరు కాపు కు చెందిన అర్వింద్​ నిజామాబాద్​ ఎంపీగా ​ గెలిచారు. ఈ నేపథ్యంలో కాపు ఓటర్లు ప్రాబల్యం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో  కాంగ్రెస్​ బలోపేతానికి డీఎస్​ వ్యూహారచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

కేడర్​ ను బుజ్జగించే పనిలో బీఆర్ఎస్​..

2015లో డీఎస్  కాంగ్రెస్​ను వీడి బీఆర్ఎస్​లో చేరడంతో  ఆయన అనుచరులు కూడా భారీ సంఖ్యలో వెంట నడిచారు.  ఆ తరువాత బీఆర్ఎస్​లో ఇమడలేని కొంత మంది డీఎస్​అనుచరులు 2019లో ఆయన చిన్న కుమారుడు  అర్వింద్​ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్​పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.   డీఎస్​ వెంట  ఉద్యమ నేతలు పదవులు ఆశించి నిరాశపడ్డ నేతలు వెళ్లకుండా  బుజ్జగించే పనిలో బీఆర్ఎస్​లీడర్లు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.