తెలంగాణలో హోరాహోరీగా జరిగిన తొలిదశ పంచాయితీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేసి సర్పంచ్ ఎవరన్నది డిసైడ్ చేయాల్సి వచింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందూరు మండలం చిన్న ఎలికిచర్ల చిన్న ఎలికిచర్ల గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోల్ అవ్వడంతో టాస్ వేసి సర్పంచ్ ను నిర్ణయించారు ఎన్నికల అధికారులు.
ఎలికిచర్ల గ్రామపంచాయితీ బరిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మరాటి రాజు, అదే పార్టీకి చెందిన మరో అభ్యర్థి మరాటి రాము పోటీ చేశారు. ఇద్దరికీ 212 ఓట్లు వచ్చాయి. ఓట్లు సమానం రావడంతో అధికారులు రికౌంటింగ్ జరిపారు. ఓట్లు మళ్లీ సమానంగా ఉండడంతో ఈసారి అధికారులు టాస్ వేశారు. టాస్ ఎవరిని వరిస్తుందోనని ఇద్దరు అభ్యర్థులతో పాటు మొత్తం గ్రామం వేచి చూసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ ఎపిసోడ్ లో చివరకు టాస్ మరాఠీ రాజును వరించడంతో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ గురువారం (డిసెంబర్ 11) ప్రశాంతంగా ముగిసింది. తొలి విడతలో 3,834 సర్పంచ్, 27,628 వార్డ్ మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాధారణ ఎన్నికలతో పోల్చితే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఒక్కో జిల్లాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం సమయానికి వెలువడిన ఫలితాలు ఇలా ఉన్నాయి...
- కాంగ్రెస్: 1733
- బీఆర్ఎస్ 721
- బీజేపీ 133
- ఇతరులు 311

