- –లక్ష్యసేన్ కూడా
- సింధు ఇంటిదారి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇండియా డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, యంగ్స్టర్ లక్ష్యసేన్ సెమీఫైనల్ చేరుకున్నారు. పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్స్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–19, 21–13తో వరుస గేమ్స్లో సుపక్ జొంకో–కెడ్రెన్ (థాయ్లాండ్) జంటను ఓడించి ముందంజ వేసింది.
తొలి గేమ్ను కష్టపడి నెగ్గిన సాత్విక్–చిరాగ్.. రెండో గేమ్ను ఈజీగా ఖాతాలో వేసుకున్నారు. మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్లో లక్ష్యసేన్ 19–21, 21–15, 21–13తో లో కీన్ యెవ్ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. కాగా, విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్లో ఇండియా స్టార్ సింధు 24–22, 17–21, 18–21తో రెండో సీడ్, ఒలింపిక్ చాంపియన్ చెన్ యు ఫీ (చైనా) చేతిలో పోరాడి ఓడింది.
గాయం నుంచి కోలుకుని నాలుగు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సింధు 92 నిమిషాల పాటు సాగిన ఈ మారథాన్ మ్యాచ్లో అద్భుతమైన స్ట్రోక్ ప్లే, ఫిజికల్ ఫిట్నెస్ చూపెట్టింది. ఉత్కంఠగా జరిగిన తొలి గేమ్లో 6–12, 11–15 వెనుకబడినా అద్భుతంగా పుంజుకొని గెలిచింది. కానీ, రెండో గేమ్లో బ్రేక్ తర్వాత అనూహ్యంగా తడబడింది. నిర్ణాయక మూడో గేమ్లో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివర్లో యు ఫీ ధాటిని తట్టుకోలేక ఓడిపోయింది.