
మునగాల, వెలుగు: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో స్కూల్ బస్సు అదపు తప్పి చెరువులోకి దూసుకుపోయింది. సోమవారం చివ్వెంల మండలం వల్లభాపురంలోని సెయింట్ పౌల్స్ పాఠశాలకు చెందిన బస్సు గుంజలూరు నుంచి 15 మంది విద్యార్థులతో నేలమర్రి వైపు వెళ్తుంది. ఈ క్రమంలో చెరువు కట్టపై నుంచి వెళ్తుండగా మరో వాహనం ముందు రావడంతో అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
కట్టపై ఉన్న చెట్లకు ఢీకొట్టి బస్సు నిలిచిపోయింది. గమనించిన స్థానికులు విద్యార్థులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. జేసీబీ సహాయంతో గ్రామస్థులు బస్సును బయటకు లాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల బస్సుకు సరైన ఫిట్నెస్ లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు.