- 20 మంది పిల్లలకు గాయాలు, ఇద్దరి పరిస్థితి సీరియస్
- డ్రైవర్ మద్యం తాగి నడపడంతో ప్రమాదం
- రంజాన్ రోజు స్కూల్ నడిపిన యాజమాన్యం.. ప్రిన్సిపాల్, డ్రైవర్, బస్సు ఓనర్ అరెస్టు
చండీగఢ్: హర్యానాలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడి ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘోర ప్రమాదంలో మరో 20 మంది పిల్లలు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది. మహేంద్రగఢ్ జిల్లాలోని ఉన్హాని గ్రామం వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. గురువారం రంజాన్ పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉన్నప్పటికీ జీఎల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సెలవు ప్రకటించకుండా క్లాసులు నిర్వహించింది. దీంతో ఉదయమే పిల్లలు స్కూల్ బస్సులో బడికి బయల్దేరారు. ఈ క్రమంలో ఉన్హాని గ్రామానికి సమీపంలోకి రాగానే అక్కడున్న ఓ టర్నింగ్లో బస్సు అదుపు తప్పింది.
దీంతో ఆ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టి బోల్తా పడిపోయింది. ప్రమాద సమయంలో ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్న 40 మంది పిల్లలు ఆ బస్సులో ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన పిల్లల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం రోహ్తక్ లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ బస్సులోంచి దూకి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతను మద్యం మత్తులో బస్సు నడిపినట్లు తెలిసిందని చెప్పారు. అలాగే బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు కూడా 2018లోనే ముగిసిందన్నారు.
వెహికల్ పేపర్స్ కూడా సరిగా లేవని తెలిపారు. స్కూలు ప్రిన్సిపాల్, డ్రైవర్, బస్సు యజమానిని అరెస్టు చేశామన్నారు. ఫిట్నెస్ లేకుండా నడిపిస్తున్న బస్సులను అడ్డుకోవడంలో ఫెయిల్ అయిన స్థానిక రోడ్డురవాణా అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హర్యానా సీఎం నాయబ్ సైనీ ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతూ స్థానిక యంత్రాంగం బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నదని తెలిపారు. సెలవు రోజున స్కూల్ ఎందుకు నడిపిస్తున్నారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా తెలిపారు. స్కూల్కు షోకాజ్ నోటీసు ఇచ్చామని చెప్పారు. ఈ దుర్ఘటనకు స్కూల్ మేనేజ్మెంట్, డ్రైవర్, బస్సు యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.