చిత్తూరు జిల్లాలో భారీ వర్షం..రెండు రోజులు స్కూళ్లు బంద్

చిత్తూరు జిల్లాలో భారీ వర్షం..రెండు రోజులు స్కూళ్లు బంద్

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  భారీ వర్షాలతో తిరుపతి  జలమయం అయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాధవ నగర్, గొల్లవానిగుంట, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్  దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జిల కింద భారీగా వర్షపు నీరు చేరింది. కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండడంతో చిత్తూరు జిల్లాలో పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

 మరోవైపు ..వాతావరణం అనుకూలించక పోవడంతో జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో దిగాల్సిన హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానాన్ని  బెంగళూరుకు మళ్లించారు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమానాలను హైదరాబాద్ కు వెనుదిరిగాయి.