అట్టహాసంగా స్కూళ్ల పునఃప్రారంభం... స్టూడెంట్స్ ను పూలతో ఆహ్వానించిన టీచర్లు

అట్టహాసంగా స్కూళ్ల పునఃప్రారంభం... స్టూడెంట్స్ ను పూలతో ఆహ్వానించిన టీచర్లు
  • యూనిఫామ్, పుస్తకాల పంపిణీ

వెలుగు, నెట్​వర్క్: ఎండాకాలం సెలవులు ముగించుకొని స్కూళ్లు గురువారం అట్టహాసంగా పున:ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లను అందంగా ముస్తాబు చేసి, తోరణాలు కట్టి అలంకరించారు. బడికి వచ్చే విద్యార్థులపై టీచర్లు పూలు చల్లి ఆహ్వానించారు. స్టూడెంట్లకు పూలు అందించి స్వాగతం పలికారు. మొదటిరోజు అడ్మిషన్ల కోసం వచ్చే పిల్లలు, వారి తల్లిదండ్రులతో స్కూళ్లలో పండగ వాతావరణం నెలకొంది. 

మొదటి రోజే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. అధికారులు స్కూళ్లను సందర్శించి వేడుకల్లో పాల్గొన్నారు. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి, డీఈవో రామారావు పలు స్కూళ్లలో జరిగిన వేడుకల్లో పాల్గొని స్టూడెంట్లకు పుస్తకాలు, యూనిఫామ్​లు అందజేశారు. 

ప్రైవేట్​కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. నేరడిగొండలోని జడ్పీ హై స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు అందజేశారు.