ట్రయాంగిల్ ఫైట్​తో కాంగ్రెస్​కు చేజారిన సీట్లు!

ట్రయాంగిల్ ఫైట్​తో కాంగ్రెస్​కు చేజారిన సీట్లు!
  • గ్రేటర్​లోని చాలా సెగ్మెంట్లలో ఇదే తీరు  
  • ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చిన బీజేపీ
  • గెలుపులోనూ వెనకబడిన కమలం పార్టీ

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్​ సిటీలోని చాలా సెగ్మెంట్లలో ముక్కోణపు పోటీ కాంగ్రెస్​కు తీవ్ర నష్టం కలిగించింది. బీజేపీ సైతం ఓట్లను చీల్చగా.. మిగతా ఓట్లు బీఆర్ఎస్​కు పడడంతో గ్రేటర్ పరిధిలో ఆ పార్టీ  ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ముక్కోణపు పోటీ జరిగిన ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ లాభపడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్​కు పడి ఉంటే ఆయా చోట్ల గెలుపొందేది. ఎన్నికల ప్రచార సమయంలో గ్రేటర్​లోని చాలా సెగ్మెంట్లలో కాంగ్రెస్​కు అనుకూల గాలులు వీచాయి. బీజేపీ సైతం భారీగా ప్రచారం చేయడం, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హైదరాబాద్​లో ప్రచారం చేయడంతో కమలం పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఊహించని రీతిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం కాంగ్రెస్​కు నష్టం కలిగించింది. దీంతో బీఆర్ఎస్​ఎక్కువ లాభపడింది. అయితే, బీజేపీ పెద్దగా సీట్లను సాధించలేకపోయింది. కేవలం ఒక్కసీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

చీలిన ఓట్లతోనే నష్టం..

గ్రేటర్ ​కోర్ ​సిటీలోని ముషీరాబాద్​, అంబర్​పేట, ఖైరతాబాద్​, జూబ్లీహిల్స్, శివారులోని ఉప్పల్, శేరిలింగంపల్లి, ఎల్​బీనగర్​, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్​, చేవెళ్ల వంటి స్థానాల్లో ముక్కోణపు పోటీ కొనసాగింది. ముషీరాబాద్​లో బీజేపీ, కాంగ్రెస్​ మధ్య చీలిన ఓట్లతో బీఆర్ఎస్​కు కలిసొచ్చింది. ఇక్కడ మొత్తం లక్షా 52 వేల 551 ఓట్లు పోలైతే.. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్​కు 75 వేల 207 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ​అభ్యర్థి అంజన్​ కుమార్​యాదవ్​కు 37 వేల 410 ఓట్లు పోల్ ​అయ్యాయి.  బీజేపీ అభ్యర్థి   కారణంగా కాంగ్రెస్​కు నష్టం జరిగింది. అలాగే మేడ్చల్​లో బీఆర్ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ల మధ్య పోటీ జరిగింది. మొత్తం 3 లక్షల 96 వేల 988 ఓట్లు పోలైతే బీఆర్ఎస్​ అభ్యర్థి మల్లారెడ్డికి లక్షా 86 వేల 017 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థికి లక్షా 52 వేల 598 ఓట్లు వచ్చాయి. మల్కాజిగిరిలో కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ మధ్య తీవ్రస్థాయిలో పోటీ కొనసాగింది. ఇక్కడ 2 లక్షల 64 వేల 25  ఓట్లు పోలైతే బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి లక్షా 24 వేల 683 ఓట్లు పడ్డాయి.  కాంగ్రెస్​కు 74 వేల 872 ఓట్లు వచ్చాయి. కుత్బుల్లాపూర్​లో మొత్తం 3 లక్షల 99 వేల 852 ఓట్లు పోలైతే బీఆర్ఎస్​ అభ్యర్థి వివేకానందకు లక్షా 87 వేల 999 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్​అభ్యర్థి కొలన్​హన్మంతరెడ్డికి లక్షా 02 వేల 423 ఓట్లు రావడం గమనార్హం. కూకట్​పల్లిలోనూ ముక్కోణపు పోటీ కారణంగా కాంగ్రెస్​నష్టపోయింది. ఇక్కడ  మొత్తం 2,50,864 ఓట్లు పోల్​ కాగా బీఆర్ఎస్​ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు 1,35,635 ఓట్లు, కాంగ్రెస్​ అభ్యర్థి బండి రమేశ్​కు 60,248 ఓట్లు వచ్చాయి.

శివారులో ఇలా..

 ఉప్పల్​ లో మొత్తం 2,72,870 ఓట్లు పోలైతే, బీఆర్ఎస్​ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డికి 1,32,927 ఓట్లు, కాంగ్రెస్​ అభ్యర్థి పరమేశ్వర్​ రెడ్డికి 83,897 ఓట్లుపడ్డాయి. శేరిలింగంపల్లిలో మొత్తం 3,55,692 ఓట్లు పోలైతే బీఆర్ఎస్​ అభ్యర్థి అరికెపూడి గాంధీకి 1,56,577 ఓట్లు పోల్ అవగా.. కాంగ్రెస్​ అభ్యర్థి జగదీశ్వర్​గౌడ్​కు 1,09,930 ఓట్లు వచ్చాయి. చేవెళ్లలోనూ బీఆర్ఎస్​, కాంగ్రెస్​మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. ఇక్కడ మొత్తం 1,94,834 ఓట్లు పోలయ్యాయి. కాగా బీఆర్ఎస్​అభ్యర్థి కాలె యాదయ్యకు 75,843 ఓట్లురాగా, కాంగ్రెస్​ అభ్యర్థి భీం భరత్​కు 74,981 ఓట్లు వచ్చాయి. ఖైరతాబాద్​ లో  కాంగ్రెస్​, బీఆర్ఎస్​, బీజేపీ మధ్య పోటీ జరిగింది. ఇందులో బీఆర్​ఎస్ ​అభ్యర్థి దానం నాగేందర్​కు 67,165 ఓట్లు రాగా, కాంగ్రెస్​ అభ్యర్థి
విజయారెడ్డికి 45,061 ఓట్లు పడ్డాయి. సికింద్రాబాద్​లోనూ బీఆర్ఎస్​ అభ్యర్థి టి. పద్మారావుకు 70,254 ఓట్లు రాగా, రెండోస్థానంలో కాంగ్రెస్ ​అభ్యర్థి ఆదం సంతోష్​కు 27,810 ఓట్లు పడ్డాయి. జూబ్లీహిల్స్​లో 1,77,551ఓట్లు పోల్​కాగా, బీఆర్ఎస్​అభ్యర్థి మాగంటి గోపీనాథ్​కు 80,328 ఓట్లు పడ్డాయి. అలాగే కాంగ్రెస్​అభ్యర్థి అజారుద్దీన్​కు 63,838 ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో మొత్తం 1,51,815 ఓట్లు పోల్​ కాగా, ఎంఐఎం అభ్యర్థి మాజిద్​హుస్సేన్​కు 62,195 ఓట్ల పడ్డాయి. కాంగ్రెస్​ అభ్యర్థి ఫిరోజ్​ఖాన్​కు 60,148 ఓట్లు వచ్చాయి. పటాన్​చెరులో మొత్తం 2,76,510 ఓట్లు పోలైతే బీఆర్ఎస్​అభ్యర్థి గూడెం మహిపాల్​రెడ్డికి 1,05,166 ఓట్లువస్తే కాంగ్రెస్​ అభ్యర్థి శ్రీనివాస్​గౌడ్​కు 97,739 ఓట్లు పడ్డాయి. ఇలా చాలా సెగ్మెంట్లలో ముక్కోణపు పోటీ కారణంగా కాంగ్రెస్​కు ఎక్కువ నష్టం జరిగింది.

ఓల్డ్ సిటీలో మినహా..

గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​కు​ పటిష్టమైన కార్యకర్తల వ్యవస్థ ఉంది. దీంతోనే ఓల్డ్ సిటీలో మినహా మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల త్రిముఖ పోటీ జరిగింది. బీఆర్ఎస్​ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను చాలామంది తమ ఓట్ల రూపంలో నిరూపించారు. వాటిలో కొన్ని బీజేపీ ఖాతాలో పడడం కాంగ్రెస్​కు నష్టం కలిగింది. ఎవరికి వారు గెలుపు మాదే అనే రీతిలో ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకించి శివారు ప్రాంతాలైన శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్​బీనగర్​ వంటి ప్రాంతాల్లో సెటిలర్లు సైతం పెద్దసంఖ్యలో బీఆర్ఎస్​ వైపు మొగ్గు చూపారు.