ముంబై: విదేశాలలోని మూడు కంపెనీలతో అదానీ గ్రూప్ జరిపిన రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్లలో నిబంధనల అతిక్రమణ జరిగిందా....అనే అంశాన్నీ సెబీ దర్యాప్తు చేస్తోంది. ఈ మూడు ఆఫ్షోర్ కంపెనీలతోనూ అదానీ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీకి లింకులున్నాయనేది సమాచారం. అదానీ గ్రూప్లోని అన్లిస్టెడ్ కంపెనీలలో చాలా వాటితో ఈ ఆఫ్షోర్ కంపెనీలు మూడూ గత 13 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్లను సాగించాయి. పై మూడు ఆఫ్షోర్ కంపెనీలలో వినోద్ అదానీ బెనిఫిషియల్ ఓనర్, డైరెక్టర్గా ఉన్నారని, లేదా మరో రకంగా ఆయనకు వాటితో లింకులున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లకు చెందిన గ్రూప్లు, చుట్టాలు, సబ్సిడరీ కంపెనీలను రిలేటెడ్ పార్టీలుగా చెబుతారు. ఒకవేళ అదానీ గ్రూప్ ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్లలో నిబంధనలు ఏవైనా అతిక్రమించిందా? అలాగే గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీలు...సంబంధిత లావాదేవీల డిస్క్లోజర్లో సరిగ్గానే వ్యవహరించాయా అనే కోణంలో సెబీ దర్యాప్తు సాగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని రిలేటెడ్ పార్టీ లావాదేవీలకు వాటాదారుల ఆమోదం సైతం లిస్టెడ్ కంపెనీలు పొందాల్సి ఉంటుంది.
మరింత సమాచారం కోసం సెబీకి పంపిన ఈమెయిల్కు బదులు రాలేదు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలోనూ సెబీ చెయిర్ పర్సన్ మాధబి పురి బుచ్ అదానీ గ్రూప్ వ్యవహారంపై మాట్లాడటానికి ఇష్టపడని విషయం తెలిసిందే. వినోద్ అదానీ హోల్డింగ్ కంపెనీ అదానీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కు పంపిన ఈమెయిల్కు కూడా జవాబు రాలేదు. జనవరి నెలలో హిండెన్బర్గ్ రిసెర్చ్ రిపోర్టు చేసిన ఆరోపణల తర్వాత తాజాగా ఈ దర్యాప్తు మొదలైంది.