
- నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెంచేందుకు కొత్త చర్యలు
న్యూఢిల్లీ: బాండ్ మార్కెట్ను మరింతగా మెరుగు పరిచేందుకు సెబీ చర్యలు తీసుకుంటోంది. పబ్లిక్ ఇష్యూల్లో ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెంచేందుకు బాండ్ల ఫేస్ వాల్యూని తగ్గించాలని ఓ కన్సల్టేషన్ పేపర్లో పేర్కొంది. ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో జరిగే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీల) ఫేస్ వాల్యూని రూ. లక్ష నుంచి రూ.10 వేలకు తగ్గించాలని ఆలోచిస్తోంది. బాండ్ మార్కెట్లో సెక్యూరిటీల ఇష్యూలు ‘ఫాస్ట్ ట్రాక్ (తొందరగా జరిగితే) ’ మోడ్లోకి వెళితే బిజినెస్లకు మేలు జరుగుతుందని సెబీ భావిస్తోంది. బాండ్ల ఇష్యూలో ఖర్చు, టైమ్ రెండూ తగ్గించేందుకు ఈ కొత్త చర్యలు సాయపడతాయని కన్సల్టేషన్ పేపర్లో పేర్కొంది. కంపెనీల బాండ్ ఇష్యూలో నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెంచేందుకు ఎన్సీడీలు, నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (ఎన్సీఆర్పీఎస్) ఫేస్ వాల్యూ రూ.10 వేలకు తగ్గించాలని సలహా ఇచ్చింది. ఇలాంటి సందర్భాల్లో బాండ్లు ఇష్యూ చేసే కంపెనీలు మర్చంట్ బ్యాంకర్ను నియమించాలని, బయటపెట్టిన డిటైల్స్ కరెక్టా? కాదా? అని చెక్ చేయాలని సెబీ పేర్కొంది.
ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో బయటపెట్టాల్సిన వివరాలను అనౌన్స్ చేయాలని చెప్పింది. అంతేకాకుండా ఇలాంటి బాండ్ల ఇష్యూ సింపుల్గా ఉండాలని తెలిపింది. కిందటేడాది అక్టోబర్లో రూ.10 లక్షలు ఉన్న బాండ్ల ఫేస్ వాల్యూని సెబీ రూ. లక్షకు తగ్గించిన విషయం తెలిసిందే. ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ (ఓబీపీఎస్) ద్వారా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ మరింత పెరుగుతుందని సెబీ అంచనా వేస్తోంది. ‘ ఈ ఏడాది జులై–సెప్టెంబర్ మధ్య వచ్చిన బాండ్ల ఇష్యూలో నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 4 శాతం బాండ్ల కోసం సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. సాధారణంగా ఈ నెంబర్ సగటున ఒక శాతం ఉంది. దీనికి తోడు ఓబీపీఎస్లలో 1,974 యూజర్లు రూ.333 కోట్లు ఇన్వెస్ట్ చేశారు’ అని సెబీ వివరించింది. వడ్డీ చెల్లింపులు లేదా బాండ్లను తిరిగి కొనుగోలు చేయడానికి 15 రోజుల ముందే రికార్డ్ డేట్ను ప్రకటించాలని తెలిపింది. అంతేకాకుండా బాండ్ల లిస్టింగ్ ప్రస్తుతం ఉన్న టీ+6 నుంచి టీ+3 కి తగ్గించాలని పేర్కొంది.