- పోలింగ్ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
- నిజామాబాద్ డివిజన్లోని 8 మండలాలు,
- కామారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో 14న పోలింగ్
- ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థుల యత్నాలు
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : రెండో విడత ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు లేకపోవడంతో పల్లెల్లో ప్రశాంతత నెలకొంది. నిజామాబాద్ డివిజన్లోని 8 మండలాలు, కామారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. నిజామాబాద్జిల్లాలోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మొపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల్లో 196 జీపీలు ఉండగా 38 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 158 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 568 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
1,760 వార్డుల్లో ఐదు వార్డులకు అసలు నామినేషన్లు వేయలేదు. 674 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగతా 1,081 వార్డుల నుంచి 2,634 మంది పోటీ చేస్తున్నారు. గురువారం ఎంపీడీవో ఆఫీసుల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ మెటీరియల్ తీసుకొని ఎన్నికల నిర్వహణకు సిబ్బంది 1,476 పోలింగ్ సెంటర్స్ చేరుకోనున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి , పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండలాల్లోని 197 పంచాయతీలకు గాను 44 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వార్డు మెంబర్లు మొత్తం 1,654లో 776 ఏకగ్రీవమయ్యాయి. 153లో సర్పంచ్ అభ్యర్థులు 506 మంది పోటీలో ఉన్నారు. 873 వార్డు మెంబర్ స్థానాలకుగాను 2,655 మంది బరిలో ఉన్నారు. 1655 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు తరలనున్న ఎన్నికల సిబ్బంది
ఎన్నికల నిర్వహణ సిబ్బంది శనివారం సాయంత్రం వరకు గ్రామాలకు చేరుకోనున్నారు. ఇప్పటికే ఆర్వోలు, పోలింగ్ నిర్వహణ అధికారులు, సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యింది. మండల కేంద్రాల్లో పోలింగ్ అధికారులు, సిబ్బందికి మెటిరియల్ పంపీణీ చేస్తారు. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.
వారం రోజులు హోరెత్తిన ప్రచారం..
పల్లెల్లో వారం రోజులు రెండో విడత ప్రచారం హోరెత్తింది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేశారు. మద్దతుదారులకు టిఫిన్స్తో పాటు మధ్యాహ్నం లంచ్ అరెంజ్ చేశారు. అన్ని పల్లెల్లో చికెన్, మటన్ భోజనాలు పెట్టించారు. అభ్యర్థుల ఇండ్ల ముందు టెంట్లు వేసి ఫంక్షన్ తరహాలో వడ్డన చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపారు. ప్రతి ఇంటికీ క్వార్టర్ బాటిల్ పంపారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల చొప్పున నగదు పంపిణీ షురూ చేశారు.
గెలుపు కోసం ఓట్లు లెక్కలేసుకుని అవసరమైన ఓట్లు ఆ మేరకు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. రెండు రోజులకు అవసరమైన లిక్కర్ బాటిల్స్ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. కులసంఘాలకు ఫుల్ బాటిల్స్ పంపుతూ ఓటర్లకు క్వాటర్ సీసాలు సప్లయ్ చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో 2 రోజులు ఫుల్గా దావత్లు అయ్యాయి. ఇప్పటికే కుల సంఘాలకు నజరానాలు ఇచ్చిన అభ్యర్థులు పలు చోట్ల ఓటర్లకు నేరుగా పైసలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గాంధారి మండలంలో ముఖ్యమైన గ్రామాల్లో పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారు. ఎల్లారెడ్డి, పిట్లం, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు చోట్ల మద్యం ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు పంచుతున్నట్లు తెలుస్తోంది.

