కీసరకు 600 చెట్లు తరలించేందుకు నిర్ణయం
ముంబై నుంచి స్పెషల్ వెహికల్
కీసర ఫారెస్ట్లో రీ ప్లాంటేషన్
హైదరాబాద్, వెలుగు: ‘సెక్రటేరియట్లో బిల్డింగులు కూల్చేశారు సరే.. అందులోని చెట్లను ఏం చేస్తారు?’ అనే విషయంపై స్పష్టత వస్తోంది. వందల ఏండ్ల నాటి భారీ వృక్షాల రీ ప్లాంటేషన్ కోసం సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. వేళ్లతోపాటు పెకిలించిన చెట్లను కీసర ఫారెస్ట్ లో నాటేందుకు ముంబై నుంచి ప్రత్యేకంగా వెహికల్ ను తీసుకురానుంది. ఈ మొత్తం ప్రాసెస్ కు రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెక్రటేరియట్లో అశోక, మర్రి, వేప లాంటి చెట్లు 600 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వంద ఏండ్లకు పైబడిన చెట్లు 30 దాకా ఉన్నట్లు సమాచారం.
పర్యావరణవేత్తల ఆందోళన
పాత సెక్రటేరియట్ను కూల్చి కొత్తది కడతారని చెప్పినప్పటి నుంచి చెట్లను ఏం చేస్తారోనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు కాలుష్యం పెరుగుతుంటే చెట్లను కాపాడుకోకుండా ఇలాంటి నిర్ణయాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. హరితహారం చేస్తూ కోట్ల మొక్కలు నాటాలంటున్న సర్కారు.. సెక్రటేరియట్ లోని భారీ చెట్లను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిని వేళ్లతోపాటు తీసే క్రమంలో డ్యామేజ్ అయినా, తరలించే క్రమంలో ఇబ్బంది అయినా కీసర ఫారెస్టులో బతకడం అనుమానమేనని చెబుతున్నారు.
త్వరలో సెక్రటేరియట్కు సీఎం కేసీఆర్
త్వరలో సెక్రటేరియట్ ను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారని అధికారులు చెబుతున్నారు. నిజానికి గత నెల 31న సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ వస్తున్నట్లు ఆదేశాలు రావటంతో పోలీసు, ఇతర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంతో ఈ పర్యటన వాయిదా పడిందని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. అతి త్వరలో సీఎం సెక్రటేరియట్ కు వస్తారని అధికారులు చెబుతున్నారు. ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అసెంబ్లీకి వెళ్లేటపుడు లేదా అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్ కు వెళ్లేటపుడు సీఎం వస్తారని అధికారులు చెబుతున్నారు.
For More News..