
ముంబై: శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. ఎవరి ప్లేస్ను అతను భర్తీ చేస్తాడో చెప్పాలని ఎదురు ప్రశ్నించాడు. ‘ఎవరి ప్లేస్లో శ్రేయస్ను తీసుకోవాలి. ఇందులో అతని తప్పు లేదు. మా తప్పు కూడా లేదు. ప్రస్తుతానికి 15 మందిని ఎంపిక చేయాలి. జట్టు అవసరాలను బట్టి ప్లేయర్లను తీసుకున్నాం. కాబట్టి అవకాశం కోసం శ్రేయస్ వేచి చూడాల్సిందే’ అని చీఫ్ సెలెక్టర్ స్పష్టం చేశాడు. యశస్వి జైస్వాల్ను ప్రధాన టీమ్లోకి తీసుకోకపోవడం కూడా దురదృష్టకరమన్నాడు. అభిషేక్ శర్మకు బౌలింగ్ కూడా చేసే సామర్థ్యం ఉండటం కలిసొచ్చిందన్నాడు. ఇక, స్పీడ్ స్టర్ బుమ్రా వర్క్ లోడ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని అగార్కర్ మరోసారి స్పష్టం చేశాడు. కాకపోతే పెద్ద మ్యాచ్లకు, టోర్నీలకు బుమ్రా అందుబాటులో ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘వర్క్ లోడ్ విషయంలో ఎటువంటి రాతపూర్వక ప్రణాళిక లేదు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత మంచి విరామం లభించింది. ఫిజియోలు లేదా సంబంధిత వ్యక్తులు ఎల్లప్పుడూ తనతో టచ్లో ఉన్నారు. గాయానికి ముందు నుంచే బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించాం. ఎందుకంటే అతను చాలా విలువైనవాడని మాకు తెలుసు’ అని అగార్కర్ పేర్కొన్నాడు.
భవిష్యత్లో ముఖ్యమైన మ్యాచ్ల కోసం బుమ్రాను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నాడు. ‘బుమ్రాను పెద్ద మ్యాచ్లకు అందుబాటులో ఉంచాలని అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రతి ఆట పెద్దదే. వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో సిరీస్లు ఉంటాయి. వాటికి అతన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. చాలా మంది ఫాస్ట్ బౌలర్లను మేం పర్యవేక్షిస్తున్నాం. కానీ 2–3 ఏండ్ల కిందట గాయమైన బుమ్రాపై మరింత ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఈ సిరీస్ అయినా రాబోయే ఆరు నెలల్లో మరో సిరీస్ అయినా ఇందులో మార్పు ఉండదు. ఎందుకంటే అతను చాలా ప్రత్యేకమైన బౌలర్’ అని అగార్కర్ వివరించాడు.