![బీజేపీకి మహిళలంటే గౌరవం లేదు..వారి శ్రమకు తగిన ఫలితం దక్కట్లేదు](https://static.v6velugu.com/uploads/2024/05/senior-congress-leader-rahul-gandhi-said-that-bjp-has-no-respect-for-women_RWP6zY5BOf.jpg)
- సెకండ్ క్లాస్ సిటిజన్లుగా చూస్తున్నరు: రాహుల్ గాంధీ
- ఢిల్లీలో ఎన్నికల ప్రచారం
- పెరిగిన ధరలతో ఎలా బతకాలని ఓ మహిళ కన్నీరు
- కాంగ్రెస్ హయాంలో రూ.350 నుంచి 400 ఉన్న సిలిండర్ను
- మోదీ 1500కు పెంచారని ఆవేదన
- అండగా ఉంటామని రాహుల్ ఓదార్పు
న్యూఢిల్లీ : బీజేపీకి మహిళలంటే గౌరవం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఓటు బ్యాంకు కోసమే వారిని బీజేపీ మోసం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. మహిళలను బీజేపీ లీడర్లంతా సెకండ్ క్లాస్ సిటిజన్ కింద లెక్కేస్తారని ఆరోపించారు. బీజేపీ అనుబంధ సంఘం ఆర్ఎస్ఎస్ది కూడా అదే ఆలోచన అని, అందుకే ఆర్ఎస్ఎస్లో మహిళలకు ఎంట్రీ ఇవ్వడం లేదని విమర్శించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని మంగోల్పురిలో మహిళలతో రాహుల్ సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత వారిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ‘‘ఎంతో ఆర్భాటంగా మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ తీసుకొచ్చింది. పార్లమెంటులో పాస్ చేయించుకుంది. కానీ.. అమలు చేసే విషయానికొచ్చేసరికి పదేండ్ల తర్వాత అని చెప్తున్నది. మహిళలను బీజేపీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నది.
వారికి లోక్సభ, శాసనసభలో రిజర్వేషన్లు కల్పించడం బీజేపీకి ఇష్టం లేదు. నారీ శక్తి వందన్ అధినియమ్ స్లోగన్తో రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి పదేండ్ల తర్వాత అమలు చేస్తామనడం కరెక్టు కాదు. దీన్నిబట్టే మహిళా సాధికారతపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతున్నది. మహిళలను ఆర్ఎస్ఎస్ చేర్చుకోదు. శాఖలో కూడా వారికి ఎంట్రీ ఇవ్వదు. మహిళలంటే సెకండ్ క్లాస్ సిటిజన్ అని వారి మైండ్లో బలంగా పాతుకుపోయింది’’అని విమర్శించారు.
ఎన్నికల టైంలో రూ.200 తగ్గించి మళ్లీ పెంచారు
రాహుల్ గాంధీ ప్రసంగం మధ్యలో ఓ మహిళ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పెరిగిన ధరలతో తమ బతుకులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాకు నలుగురు పిల్లలు. భర్త లేడు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడి పిల్లలను పెంచుతున్నా. కాంగ్రెస్ హయాంలో సిలిండర్ ధర రూ.350 నుంచి రూ.400 ఉండె. రూ.1200 ఉన్నా రూ.800 నుంచి 850 సబ్సిడీ వచ్చేది. కానీ, మోదీ హయాంలో సిలిండర్ ధర రూ.1200కు పెరిగింది. నిరుడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రూ.200 తగ్గించారు.
తీరా ఎన్నికలు అయిపోగానే ఢిల్లీలో మళ్లీ రూ.1500 నుంచి రూ.1750 చేశారు. నేను ఎక్కడ సిలిండర్ కొనాలి? పిల్లలను ఎలా సాకాలి? వాళ్లకు చదువులు ఎలా చెప్పించాలి?” అని ఆ మహిళ రాహుల్ ముందు కన్నీటిపర్యంతం అయ్యారు. స్పందించిన రాహుల్.. దిగులు చెందవద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రెండో షిఫ్ట్కు మహిళలకు డబ్బులు రావు
‘‘మహిళల భద్రత బీజేపీకి అక్కర్లేదు. మహిళలు ఎంతో కష్టపడుతున్నరు. కానీ.. శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. సమాజంలో ప్రతి వర్గం గురించి మాట్లాడుతాం. కానీ.. శ్రామిక మహిళలు ఇంటికొచ్చాక చేసే పని గురించి మాట్లాడేవాళ్లు చాలా తక్కువ. బయట ఒక షిఫ్ట్ పని చేసి ఇంటికొచ్చాక కుటుంబాన్ని చూసుకోవడం రెండో షిఫ్ట్గా భావించాలి. వంట చేయాలి. భర్తను చూసుకోవాలి. పిల్లలను చూసుకోవాలి. ఇంట్లో అన్ని పనులూ చేయాలి. రెండో షిఫ్ట్ పనికి మాత్రం డబ్బులు రావు’’అని రాహుల్గాంధీ అన్నారు.
16 గంటలు పని చేస్తున్నరు
మగవాళ్లు ఎనిమిది గంటలు పని చేస్తే.. మహిళలు 16 గంటలు పని చేస్తారని రాహుల్ అన్నారు. ‘‘సమాజంలో మహిళలు చేసే ఏ పనికీ గుర్తింపు లేదు. ఇలా మహిళలు జీతం లేకుండా పనిచేయడం కాంగ్రెస్కు ఇష్టం లేదు. అందుకే ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకు రూ.8,500 చొప్పున ఇస్తాం. ఏడాదికి లక్ష రూపాయలు ఆ స్కీమ్ కింద మహిళల అకౌంట్లలో జమ చేస్తాం’’ అని రాహుల్ హామీ ఇచ్చారు.
తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లు పెంచుతామన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు బీజేపీతో కూటమి పోరాడుతున్నదన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ లెక్క చేయడం లేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు.
ఢిల్లీ మెట్రోలో రాహుల్ జర్నీ
సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెట్రో ప్రయాణికులతో రాహుల్ సెల్ఫీలు దిగారు. ఢిల్లీ మెట్రోలో మంగోల్పురిలో జరిగే ర్యాలీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఈశాన్య ఢిల్లీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మే 25వ తేదీన ఓటింగ్ జరగనుంది.
లోక్సభ ఎన్నికల్లో సర్ప్రైజ్ రిజల్ట్స్
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో సర్ప్రైజ్ రిజల్ట్స్వస్తాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్గాంధీ అన్నారు. దేశంలోని 90 శాతం మంది పేద ప్రజలు తమ వెంట ఉన్నారని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో కలిసి రాహుల్ లంచ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఏడుకు ఏడు సీట్లు ఇండియా కూటమి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. రాజ్యాంగం, రిజర్వేషన్లపై బీజేపీ, ప్రధాని మోదీ దాడి చేస్తున్నారని ఫైర్అయ్యారు. 22 మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే మోదీ పనిచేశారని, దేశ సంపదను అదానీకి దోచిపెట్టారని ఆరోపించారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని రాహుల్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ భవన్లో దహీ వడ తిన్న రాహుల్
ఢిల్లీ ఎన్నికల ప్రచారం మధ్యలో లంచ్ కోసం కార్యకర్తలతో కలిసి రాహుల్ తెలంగాణ భవన్కు వచ్చారు. అప్పటికే అక్కడ భోజనం చేస్తున్న తెలుగు రాష్ట్రాలు, నార్త్కు చెందిన వారు రాహుల్ను చూసి ఆశ్చర్యపోయారు. భవన్ సిబ్బంది, తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున క్యాంటీన్ కు చేరుకున్నారు. ఆయనతో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపారు. సాధారణంగా టైం దొరికితే తెలుగు వంటకాలు రుచి చూసేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీ లోని తెలంగాణ, ఏపీ భవన్కు వస్తారు.
గతంలో హైదరాబాద్ బిర్యానీ తెగ ఇష్టంగా లాగించిన రాహుల్.. ఈ సారి చికెన్, ప్రాన్స్ ఫ్రైతో పూరి, చపాతీలు తిన్నారు. ఫైనల్గా స్పెషల్గా చేయించిన దహీ వడ( పెరుగు వడ)తో లంచ్ ముగించారు.