న్యూఢిల్లీ : ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నాగర్కర్నూల్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత మందా జగన్నాథం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో మందా జగన్నాథం బాధ్యతలను స్వీకరించారు.
రెండోసారి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు మందా జగన్నాథం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా పనిచేసి, రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు త్వరితగతిన వచ్చేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను, పెండింగ్ ఉన్న బకాయిల అంశాలను కేంద్రప్రభుత్వం దగ్గరకు ఎప్పటికప్పుడు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని మందా జగన్నాథం చెప్పారు.