సెన్సెక్స్ 823 పాయింట్లు డౌన్.. 253 పాయింట్లు తగ్గిన నిఫ్టీ.. ఇన్వెస్టర్లకు రూ.5.98 లక్షల కోట్ల లాస్

సెన్సెక్స్ 823 పాయింట్లు డౌన్.. 253 పాయింట్లు తగ్గిన నిఫ్టీ.. ఇన్వెస్టర్లకు రూ.5.98 లక్షల కోట్ల లాస్

ముంబై: మిడిల్​ఈస్ట్​లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రపంచ మార్కెట్లు బలహీనపడటం,  చమురు, గ్యాస్, విద్యుత్, క్యాపిటల్​ గూడ్స్ షేర్లలో భారీ అమ్మకాల వల్ల సెన్సెక్స్, నిఫ్టీ  గురువారం ఒకశాతం వరకు నష్టపోయాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 823.16 పాయింట్లు పడిపోయి 81,691.98 వద్ద స్థిరపడింది. ఇందులోని 27 షేర్లు నష్టపోగా, మూడు లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 991.98 పాయింట్లు  (1.20 శాతం) పడిపోయి 81,523.16 వద్ద ముగిసింది. ఆరు రోజుల లాభాల తరువాత ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 253.20 పాయింట్లు (1.01 శాతం) పడిపోయి 24,888.20 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.5.98 లక్షల కోట్లు తగ్గింది. 

తాజాగా విదేశీ నిధుల ఉపసంహరణలు కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీశాయని ట్రేడర్లు  తెలిపారు. సెన్సెక్స్ స్టాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాటా మోటార్స్, టైటాన్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, లార్సెన్ అండ్​ టూబ్రో, మహీంద్రా అండ్​ మహీంద్రా,  హిందూస్తాన్ యూనిలీవర్ ఎక్కువగా నష్టపోయాయి. బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వ్, ఏషియన్ పెయింట్స్  టెక్ మహీంద్రా లాభపడ్డాయి. 

బీఎస్​ఈ మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 1.52 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.38 శాతం పడిపోయాయి. వాల్యుయేషన్ ఆందోళనలు,  పెరుగుతున్న చమురు ధరలు, - మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా- పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదని జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. 

 సెక్టోరల్ ​ఇండెక్స్​లకు భారీ నష్టాలు

బీఎస్ఈ ఇండెక్స్​లో విద్యుత్ 2.19 శాతం, యుటిలిటీస్ (2.18 శాతం), చమురు, గ్యాస్ (2.10 శాతం), రియాలిటీ (2.07 శాతం), కన్స్యూమర్ డ్యూరబుల్స్ (2.02 శాతం), ఇండస్ట్రియల్స్ (1.98 శాతం), ఆటో (1.71 శాతం), కన్స్యూమర్ డిస్క్రెషనరీ (1.67 శాతం)  మెటల్ (1.63 శాతం) పడిపోయాయి. బీఎస్ఈలో 2,729 స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు క్షీణించగా, 1,282 లాభాలతో ముగిశాయి.  ఇజ్రాయెల్,  ఇరాన్ మధ్య  ఉద్రిక్తతలు మళ్లీ మొదలవడం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి వాటితో ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్త పడ్డారని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ ఎనలిస్టు అజిత్ మిశ్రా అన్నారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్​ఐఐలు) బుధవారం రూ.446.31 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.

ప్రపంచ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో పాటు ఇజ్రాయెల్ ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడి చేసే అవకాశం,  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి టారిఫ్​ల గురించి బెదిరించడంతో పెట్టుబడిదారులు ఇష్టానుసారంగా స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అమ్మేశారని ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ (పరిశోధన) ప్రశాంత్ తాప్సే అన్నారు. 

ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి  , షాంఘైకి చెందిన ఎస్​ఎస్​ఈ కాంపోజిట్ ఇండెక్స్ సానుకూలంగా ముగియగా, జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్,  హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన హాంగ్ సెంగ్ తగ్గాయి. యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈక్విటీ మార్కెట్లు నెగెటివ్​గా ట్రేడయ్యాయి. యూఎస్ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. విమాన ప్రమాదం కారణంగా బోయింగ్​ షేర్లు నాలుగు శాతం వరకు నష్టపోయాయి.