ముంబై : బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్కేర్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. బ్యాంక్ షేర్లు మెరిశాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 23 వేల మార్క్ను మొదటిసారిగా క్రాస్ చేసి 23,026.40 దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11 పాయింట్ల (0.05 శాతం) నష్టంతో 22,957 దగ్గర సెషన్ను ముగించింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 75,637 దగ్గర జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేయగా, చివరికి 8 పాయింట్ల నష్టంతో 75,410 దగ్గర సెటిలయ్యింది.
సెన్సెక్స్లో టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కదిలాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. మరోవైపు న్యూఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ ధర శుక్రవారం రూ.900 తగ్గి రూ.72,650 దగ్గర సెటిలయ్యింది. కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.92,100 పలుకుతోంది.
సెన్సెక్స్ నుంచి విప్రో ఔట్
అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) 30 షేర్లున్న సెన్సెక్స్లో జాయిన్ కానుంది. ఐటీ కంపెనీ విప్రో ప్లేస్ను భర్తీ చేస్తుంది. ఈ ఏడాది జూన్ 24 నుంచి అదానీ పోర్ట్స్ షేర్లు సెన్సెక్స్లో ట్రేడవుతాయి. విప్రో షేర్లు ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ నుంచి బయటకొచ్చేస్తాయి. సెన్సెక్స్లో జాయిన్ అయిన మొదటి అదానీ గ్రూప్ కంపెనీగా అదానీ పోర్ట్స్ నిలిచింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 లో అదానీ పోర్ట్స్, విప్రో రెండు కంపెనీల షేర్లు ట్రేడవుతాయి. అంతేకాకుండా అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా నిఫ్టీ 50 లో ఉంది. దీంతో పాటు టాటా గ్రూప్ కంపెనీ ట్రెంట్ బీఎస్ఈ సెన్సెక్స్ 50 లో చోటు దక్కించుకుంది. దివీస్ ల్యాబోరేటరీస్ షేర్లు ఈ ఇండెక్స్ నుంచి బయటకొచేస్తాయి. ఎస్ అండ్ పీ బీఎస్ఈ 100, బీఎస్ఈ బ్యాంకెక్స్, బీఎస్ఈ సెన్సెక్స్ నెక్స్ట్ 50 ఇండెక్స్లో కూడా మార్పులు జరిగాయి.
