గ్రేటర్ హైదరాబాద్ లో తప్పని రేషన్​ తిప్పలు!..సర్వర్​ డౌన్​తో పరేషాన్​ 

గ్రేటర్ హైదరాబాద్ లో తప్పని రేషన్​ తిప్పలు!..సర్వర్​ డౌన్​తో పరేషాన్​ 
  • ఒక్కొక్కరి నుంచి ఆరుసార్లు వేలిముద్రలు 
  • రిజిస్టర్​లో రాయడం, తూకం వేయడానికి మరింత టైం
  • ఒక్కో లబ్ధిదారుడికి 20 నిమిషాలు   
  • రేషన్​షాపుల వద్ద భారీ క్యూ
  • స్పెషల్ ​టీమ్​ పనిచేస్తుందన్న డీఎస్ఓ

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: ప్రభుత్వం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్​లో మూడు నెలలకు సరిపడా రేషన్​ఒకేసారి ఇస్తుండడంతో లబ్ధిదారులు షాపుల ముందు భారీగానే క్యూ కడుతున్నారు. అయితే, సర్వర్ డౌన్​కావడం, మూడు నెలల రేషన్​కోసం ఒక్కొక్కరు ఆరుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో ఒక్కొక్కరికి సరుకులు ఇవ్వడానికి 20 నిమిషాల వరకు టైం పడుతోంది. రిజిస్టర్​లో వివరాలు రాసుకోవడం, సరుకులు తూకం వేయడం వంటి ప్రక్రియ పూర్తయ్యే సరికి ఇంకా ఆలస్యమవుతోంది.

దీంతో లబ్ధిదారులు రేషన్​షాపుల ముందు గంటల తరబడి క్యూలు కట్టాల్సి వస్తున్నది. కొన్నిచోట్ల లైన్​లో చివరన ఉన్నవారు తమదాకా సరుకులు వస్తాయో.. రావోనని డీలర్లతో వాదనలకు దిగుతున్నారు. మూడు నెలల సరుకులు కావడం, షాపుకు వెళ్తే ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో చాలామంది కూలీలకు, పనులకు వెళ్లకుండా రేషన్​షాపుల బాట పడుతున్నారు.

ఒక్కో లబ్ధిదారుడికి మూడు నెలలకు గాను సన్న బియ్యం, చక్కెర, గోధుమలు ఇవ్వడానికి బయోమెట్రిక్​లో నెలకు రెండు సార్లు చొప్పున ఆరుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తోందని, సర్వర్​డౌన్​తో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని డీలర్లు చెప్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదంటున్నారు. డీలర్లు కూడా షాపులో ఒకరు, లేదా ఇద్దరినే పనిలో పెట్టుకుంటుండడంతో పంపిణీ ఆలస్యం అవుతోందని అంటున్నారు. 

మూడు రకాల సరుకుల పంపిణీ..

జంట నగరాల్లోని 9 సర్కిళ్ల పరిధిలో 6,47,282 రేషన్​కార్డులున్నాయి. వీరికి మూడు నెలలకు 45,259.677 మెట్రిక్​టన్నుల బియ్యం, 9,709.230 మెట్రిక్​టన్నుల గోధుమలు, 88.695 మెట్రిక్​టన్నుల చెక్కర కేటాయించారు. ఒక్కొక్కరికి 6 కిలోలు అంటే మూడు నెలలకు18 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున 105 కిలోల రైస్​ఇస్తున్నారు. అలాగే, ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 15 కిలోల గోధుమలు, కిలో చొప్పున 3 కిలోల చెక్కర పంపిణీ చేస్తున్నారు. 

30 శాతం  పూర్తి చేశాం: డీఎస్ఓ

అన్ని సర్కిళ్లలో సరుకుల పంపిణీ సందర్భంగా సర్వర్ ​సమస్యలు వస్తున్నట్టు డీలర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని డీఎస్​ఓ రమేశ్​కుమార్​ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్​ సమస్య పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు.సమస్యలు వస్తున్నా నాలుగైదు రోజుల్లోనే దాదాపు 30 శాతం అంటే  2లక్షల మంది లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశామన్నారు. సరుకులు అందవేమోనన్న ఆందోళన అవసరం లేదన్నారు.