చెట్టుకి సంకెళ్లు..‘ఐయామ్ అండర్​ అరెస్ట్’ అంటూ బోర్డు

చెట్టుకి సంకెళ్లు..‘ఐయామ్ అండర్​ అరెస్ట్’ అంటూ బోర్డు

అది పాకిస్తాన్​ వాయవ్య ప్రాంతంలో లండి కోటల్ అనే టౌన్.  లోకల్ పార్క్ ఒకదాంట్లో పెద్ద మర్రిచెట్టు ఉంటుంది. కానీ, అదేం చిత్రమో.. ఆ మర్రిచెట్టుకి సంకెళ్లు వేసి ఉంటాయి.  ఆ చెట్టు మొదళ్లో ‘‘ఐయామ్ అండర్​ అరెస్ట్. తప్పతాగిన ఒక బ్రిటీష్​ ఆఫీసర్​.. నేను అటు ఇటూ కదులుతున్నా అనే కోపంలో నాకీ శిక్ష వేశాడు”అని  ఒక బోర్డు రాసి ఉంటుంది. ఈ బోర్డును 1947లో ఏర్పాటు చేశారు. కానీ, ఆ చెట్టుకి ఆ శిక్ష పడి వందేళ్లకు పైనే అవుతోంది. 1898లో  బ్రిటీష్​ కాలనీ ఆఫీసర్​ జేమ్స్​ స్క్విడ్ తాగిన మైకంలో ఆ చెట్టుకి ఈ విచిత్రమైన పనిష్మెంట్ వేశాడు. అప్పటి నుంచి ఆ చెట్టుకి ఆ సంకెళ్లు అలానే వేలాడుతున్నాయి. పాక్​కి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆ సంకెళ్లను తొలగించలేదు అక్కడి అధికారులు.  బ్రిటీష్​ పాలనలో అణిచివేత ఎంత దారుణంగా ఉందో తెలియజేయడానికి ఈ చెట్టును ఒక గుర్తుగా భావిస్తారు వాళ్లు.  అయితే ఆ ప్రాంతం ఖాన్​ షిన్వారీ అనే వ్యక్తిది. కానీ, ఆ చెట్టు ఉందన్న కోపంతో జేమ్స్​ స్క్విడ్​ దానిని బ్రిటీష్ ​పరం చేశాడు. ఇప్పుడు ఆ ఏరియా పాకిస్తాన్​ గవర్నమెంట్ స్వాధీనంలో ఉంది.  షిన్వారీ మనవడు ఇస్లాం ఖాన్​ ఇప్పుడు ఆ జాగా కోసం న్యాయపోరాటం చేస్తున్నాడు.