బర్మింగ్ హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పతకాల మీద పతకాలు సాధిస్తూ అదరగొడుతున్నారు. తాజాగా టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత్ కు చెందిన శరత్ – సతియన్ జోడీ రజత పతకం సాధించింది. ఇంగ్లండ్కు చెందిన పాల్ డ్రింక్ హాల్–లియామ్ పిచ్ఫోర్డ్ జోడీతో జరిగిన ఫైనల్ పోరులో భారత్ కు చెందిన శరత్ కమల్ ఆచంట – సతియన్ జోడీ 11 – 4 తేడాతో ఓడిపోయింది. దీంతో భారత జోడీకి రజత పతకం లభించింది.
ఒక్కరోజే 7 పతకాలు
ఇవాళ ఒక్కరోజే భారత్ సాధించిన పతకాల సంఖ్య 7కు పెరిగింది. బాక్సర్లు అమిత్ పంఘాల్, నీతు ఘన్ ఘాస్, నిఖత్ జరీన్ 3 బంగారు పతకాలు సాధించారు. పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్డ్ హోస్ పాల్ కు స్వర్ణం, అబ్దుల్లా అబూబకర్ కు రజతం వచ్చాయి. రేస్ వాక్ విభాగంలో సందీప్ కుమార్ కు కాంస్యం దక్కింది. కామన్వెల్త్ గేమ్స్ లో ఇప్పటివరకు భారత్ మొత్తం 49 పతకాలను సాధించగా, వాటిలో 17 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. కామన్వెల్త్ పతకాల పట్టికలో భారత్ ర్యాంకు 4కు చేరింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా మొదటి స్థానాల్లో ఉన్నాయి.
ఫైనల్లోకి సింధూ..
కామన్వెల్త్ లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సైతం అదరగొడుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధూ ఫైనల్ కి దూసుకెళ్లింది. సింగపూర్ షట్లర్ పై సింధు వరుస సెట్లు నెగ్గింది. జియామిన్ యో పై 21– 19,21– 17 తేడాతో ఘన విజయం సాధించింది. పదునైన షాట్లతో ప్రత్యర్థిని సింధు ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏ మాత్రం సింగపూర్ షట్లకు ఛాన్స్ ఇవ్వలేదు. గ్రౌండ్ నలువైపులా సింధు ఆడింది. రేపు ఫైనల్లో సింధు తలపడనుంది.