
‘అమ్మాయివి అవన్నీ నీకెందుకు?’ అన్నాడు తండ్రి. ‘లేదు నాన్నా.. అది నా కల’ అని చెప్పింది కూతురు. ఎప్పటికైనా తనకు పెద్ద పెద్ద వెహికల్స్ నడపాలని కోరిక. ఆ కోరికతోనే ఇప్పుడు బస్ డ్రైవర్గా జాబ్ చేస్తోంది. ఆమె పేరు రీతూ నర్వల్. రీతూ నర్వల్కు 35 ఏండ్లు. టీనేజ్లోనే తను లైఫ్ గోల్ సెట్ చేసుకుంది. అందరిలా చదువుకొని ఉద్యోగం చేయడం, డబ్బులు సంపాదించడం కాదు. డ్రైవర్ అవ్వాలలి. భారీ వెహికల్స్ నడిపి, పెద్ద పెద్ద రోడ్ల మీద స్టీరింగ్ తిప్పాలని చిన్నప్పటి నుంచీ కలలు కన్నది. మహిళలకు చాలా తక్కువ అవకాశాలు ఉన్న ఫీల్డ్ అది. తన ఆలోచన చెబితే మొదట తండ్రి వద్దన్నాడు. కానీ పట్టుబట్టింది. కొన్ని రోజులకు కూతురి మనసును అర్థం చేసుకున్నాడు తండ్రి. డ్రైవర్ కావాలన్న ఆమె కలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రీతూ డ్రైవింగ్ నేర్చుకుంది. బైక్లు, కార్లు నడిపింది. కానీ అవన్నీ చిన్న చిన్న వెహికల్స్. పెద్ద బండ్లు నడిపే డ్రైవర్ కావాలన్నది ఆమె కోరిక. ఆ తర్వాత లారీలు, ట్రక్కులు నడిపింది. మొత్తానికి 28 ఏండ్లకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకుంది. నేషనల్ హైవే మీద పెద్ద పెద్ద వెహికల్స్ స్టీరింగ్ తిప్పుతూ తన కలల ప్రయాణాన్ని సాకారం చేసుకుంది. విమెన్ డ్రైవర్గా మధ్యప్రదేశ్లో పేరు తెచ్చుకుంది రీతూ. ఆమె గురించి తెలుసుకున్న ‘అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్’ మహిళా డ్రైవర్లను ప్రోత్సహించాలని రీతూకి ఉద్యోగం ఇచ్చింది. ఇలా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నుంచి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్లో ఉద్యోగం తెచ్చుకుంది. ఈ మధ్యే ఇండోర్లో మొదటిసారిగా రాజీవ్ గాంధీ స్క్వేర్ నుంచి నిరంజన్పూర్ స్క్వేర్ మధ్య ప్యాసింజర్ బస్సు నడిపి మధ్యప్రదేశ్ ఫస్ట్ విమెన్ బస్ డ్రైవర్గా గుర్తింపు పొందింది. బస్సులో ఉన్న వాళ్లు డ్రైవర్ సీటు వైపు చూసి లేడీ డ్రైవర్ ఉండటంతో సంతోషించారు. ‘డ్రైవర్ బెహన్’ అంటూ ఎంకరేజ్ చేశారు.